సీపీ సజ్జనార్ను కలవనున్న అవంతి
సాక్షి, హైదరాబాద్: పరువు హత్యకు గురైన హేమంత్ భార్య అవంతి డీసీపీ వెంకటేశ్వర్లును కలిశారు. ఈ నేపథ్యంలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు చేరుకున్న అవంతి, పోలీసుల వద్దనున్న తన భర్త వస్తువులను తీసుకోనున్నారు. ఆమె వెంట హేమంత్ తల్లిదండ్రులు, సోదరుడు కూడా ఉన్నారు. కాగా గతంలో తన పట్ల వ్యవహరించిన తీరు, హేమంత్ను దారుణంగా హత్య చేయించిన క్రమంలో తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందంటూ అవంతి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ సీపీ సజ్జనార్ను కలిసి తమకు భద్రత కల్పించాల్సిందిగా ఆయనకు విజ్ఞప్తి చేయనున్నారు.(చదవండి: హేమంత్ది పరువు హత్య: గచ్చిబౌలి పోలీసులు)
కాగా అవంతిని ప్రేమించి పెళ్లిచేసుకున్న హేమంత్ ఈ నెల 25న అత్యంత దారుణ పరిస్థితుల్లో హత్యకు గురైన విషయం విదితమే. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఈ కేసులో మొత్తం 22 మంది నిందితులను గుర్తించిన పోలీసులు.. దీనిని ‘పరువు హత్య’ గా తేల్చారు. పక్కా పథకం ప్రకారమే, తమ పరువు తీశాడనే పగతోనే అవంతి తల్లిదండ్రులు అతడిని హత్య చేయించినట్లు పేర్కొన్నారు. కులాంతర వివాహం చేసుకున్నందుకే లోకల్ గ్యాంగ్తో కలిసి అతడి హతమార్చినట్లు అవంతి తండ్రి లక్ష్మారెడ్డి, మామ యుగంధర్ తమ ముందు అంగీకరించినట్లు వెల్లడించారు.