తొలి విడతగా గతనెల 23న రూ.3,590 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసిన సర్కారు
రేపు కాటారంలో జరిగే బహిరంగ సభలో నిధులు విడుదల చేయనున్న సీఎం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా రెండో విడత నిధులను ప్రభుత్వం ఈనెల 20వ తేదీన పంపిణీ చేయాలని నిర్ణయించింది. సోమవారం రెండో విడత నిధులను విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ పథకం కింద ప్రభుత్వం రాష్ట్రంలో 1.50 కోట్ల ఎకరాలకు సాయం అందిస్తోంది. ఎకరానికి రూ. 6 వేల చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తుంది.
20వ తేదీన భూపాలపల్లి జిల్లా కాటారంలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్రెడ్డి, మంత్రుల సమక్షంలో ఈ నిధులను విడుదల చేస్తారు. తెలంగాణలో మొత్తం 73 లక్షల మంది రైతులున్నారు. వీరందరికీ ప్రభుత్వం గత నెల 23వ తేదీన మొదటి విడత రైతు భరోసా సాయాన్ని పంపిణీ చేసింది. ప్రతి రైతుకు ఒక ఎకరానికి సరిపడే పెట్టుబడి సాయాన్ని ముందుగా విడుదల చేసింది. ఇలా దాదాపు రూ.3,590 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసింది.
రెండో విడతలో 45,11,947 మంది రైతులు రైతుభరోసా కింద రూ.2,063 కోట్ల సాయం అందుకుంటారు. దీంతో రూ.5,653 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లవుతుందని వ్యవసాయ శాఖ వెల్లడించింది. రెండో విడత నిధుల పంపిణీ అనంతరం, మూడో విడత నిధులను వీలైనంత తొందరగా విడుదల చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ పేర్కొంది.


