మధుయాష్కీకి వ్యతిరేకంగా గాంధీభవన్‌లో పోస్టర్లు | Sakshi
Sakshi News home page

మధుయాష్కీకి వ్యతిరేకంగా గాంధీభవన్‌లో పోస్టర్ల కలకలం.. ఆయన పనే!

Published Mon, Sep 4 2023 10:52 AM

Go Back Madhu Yashki Posters At Gandhi Bhavan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గాంధీభవన్‌లో పోస్టర్ల కలకలం చోటుచేసుకుంది. కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీ గౌడ్‌కు వ్యతిరేకంగా భారీగా పోస్టర్లు వెలిశాయి. సేవ్‌ ఎల్బీనర్‌ కాంగ్రెస్‌ అంటూ పోస్టర్లు దర్శనమిచ్చాయి. అయితే ఇటీవల ఎల్బీనగర్ అసెంబ్లీ స్థానానికి మధుయాష్కీ ధరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో ఎల్బీనగర్ నియోజకవర్గంపై పారాచూట్‌గా వచ్చి వాలుతున్నారంటూ పోస్టర్లు అంటించారు. గో బ్యాక్‌ నిజామాబాద్‌’ అంటూ పోస్టర్లు కనిపించడం సంచలనంగా మారింది.

కాగా  మధుయాష్కీపై  పోస్టర్లు వేయిచింది ఎల్బీనగర్‌కు చెందిన జక్కిడి ప్రభాకర్ రెడ్డి అని కాంగ్రెస్‌ నేతలు ప్రాథమికంగా గుర్తించారు.  దీంతో జక్కిడి ప్రభాకర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని మధు యాష్కిగౌడ్ కోరారు.

ఇక  2004, 2009  లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా మధు యాష్కీ విజయం సాధించారు.  2014లో జరిగిన ఎన్నికల్లోనూ నిజామాబాద్‌ నుంచి బరిలోకి దిగిన మధుయాష్కీ.. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కల్వకుంట్ల కవిత చేతిలో ఓటమిపాలయ్యారు. 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓటమిచెందారు. 
చదవండి: కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపికలో కీలకపరిణామం

ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లా నుంచి పోటీకి దూరంగా ఉండాలని మధు యాష్కీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు సిద్ధమైన ఆయన.. ఎల్బీ నగర్‌ స్థానం నుంచి  కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు కోసం ధరఖాస్తు  చేసుకున్నారు.

కాగా గాంధీభవన్‌లో నేటి ఉదయం 11 గంటల నుంచి పీఈసీ సభ్యులతో స్క్రీనింగ్ కమిటీ  వ్యక్తిగతంగా సమావేశం కానుంది. స్క్రీనింగ్‌ కమిటీ ముందు ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ నివేదిక ఇవ్వనుంది.  ఒక్కొక్క నేతలతో సాయంత్రం వరకు సమావేశం కొనసాగనుంది. అదే విధంగా పీఈసీలో లేని మాజీ మంత్రులు, మాజీ ఎంపీలతో బుధవారం స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది  పీఈసీ,ఇతర సీనియర్ నేతల అభిప్రాయం మేరకు 6 తేదీన అభ్యర్థుల ఎంపికపై నివేదికను సిద్ధం చేయనుంది. 7 తేదీన సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి నివేదిక అందజేయనుంది.
చదవండి: ముషీరాబాద్‌ బీజేపీ ఎమ్మెల్యే బరిలో దత్తాత్రేయ కుమార్తె!  

Advertisement
Advertisement