
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్య
ఎనిమిది మంది అరెస్టు.. రిమాండ్
తేజేశ్వర్ హత్య కేసు వివరాలను వెల్లడించిన గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు
గద్వాల క్రైం: ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసును జోగుళాంబ గద్వాల జిల్లా పోలీసులు ఛేదించారు. మేఘాల య హనీమూన్ మర్డర్ తరహాలో హత్య చేయించి.. అక్కడిలా తాము పోలీసులకు దొరకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.. అనంతరం లడాఖ్ లేదా అండమాన్కు వెళదామని ప్రియుడు, ప్రేయసి ప్లాన్ వేశారు. ఇందుకోసం ముందుగానే రూ.20 లక్షల రుణం కూడా తీసుకున్నారు. కానీ పోలీసులు సీసీ ఫుటేజీ, సెల్ సిగ్నల్స్ ఆధారంగా కేసును ఛేదించారు. రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన తేజేశ్వర్ హత్య కేసు వివరాలను ఎస్పీ శ్రీనివాసరావు గురువారం వెల్లడించారు.
తేజేశ్వర్తో ఐశ్వర్య పరిచయం ఇలా..
గద్వాలలోని గంటవీధికి చెందిన తేజేశ్వర్(32) ప్రైవేటు సర్వేయర్. సుజాత కర్నూలులోని ఓ ప్రైవేట్ బ్యాంకులో స్వీపర్గా పనిచేస్తోంది. ఈమె పుట్టినిల్లు గద్వాలలోని జమిచేడ్. ఈమె కూతురే ఐశ్వర్య అలియాస్ సహస్త్ర. తల్లీకూతురు తరచూ గద్వా లలోని బంధువుల ఇంటి వచ్చేవారు. ఈ క్రమంలోనే తేజేశ్వ ర్తో ఐశ్వర్యకు పరిచయం ఏర్పడింది. ఇద్దరి కులాలు ఒక్కటే కావడంతో పెద్దలు పెళ్లి చేయాలనుకున్నారు. ఇదిలా ఉండగా, సుజాతకు బ్యాంకు మేనేజర్ తిరుమలరావుతో వివాహేతర సంబంధం ఉంది.
ఈ క్రమంలో తిరుమలరావు ఐశ్వర్యతోనూ కొంతకాలంగా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విష యాన్ని దాచి ఎలాగైనా తన కూతురికి పెళ్లి చేయాలని సుజాత అనుకుంది. తేజేశ్వర్తో ఐశ్వర్య నిశ్చితార్థం చేయించింది. ఇది ఇష్టంలేని ఐశ్వర్య తిరుమలరావుతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపో యింది. దీంతో పెద్దల సమక్షంలో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకు న్నారు.
కొన్ని రోజుల తర్వాత తేజేశ్వర్, ఐశ్వర్య ఫోన్ లో మాట్లాడుకొని పెద్దల సమక్షంలో మే 18న బీచుప ల్లి ఆలయంలో వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం కూడా ఐశ్వర్య తిరుమలరావుతో తరచూ ఫోన్లో మాట్లాడేది. ఈ విషయాన్ని గ్రహించిన తేజేశ్వర్ భార్యను మందలించాడు. దీంతో తమ బంధానికి అడ్డు వస్తున్నాడనే నెపంతో ఐశ్వర్య, తిరుమలరావు కలిసి తేజేశ్వర్ను హత్య చేసేందుకు పథకం వేశారు.
నమ్మించి.. హత్య చేశారిలా..: తేజేశ్వర్ను హత్య చేసేందుకు కర్నూలు జిల్లా కృష్ణానగర్కు చెందిన సుపారీగ్యాంగ్ కుమ్మరి నాగేష్, చాకలి పరుశరాముడు, చాకలి రాజుతో రూ.6 లక్షలకు ఒప్పందం చేసుకున్నా రు. దీంతో ఆ గ్యాంగ్ ఫోన్ ద్వారా తేజేశ్వర్తో పరిచయం పెంచుకుంది. మీ జిల్లాలో తక్కువ ధరలకు భూములు ఉంటే చూపించండి అందుకు తగిన పారితోషికం ఇస్తామని నమ్మించారు. సర్వేయర్ కావడంతో తేజేశ్వర్ వారితో పలుమార్లు వెళ్లి వచ్చాడు. ఈ క్రమంలోనే ఈ నెల 17వ తేదీన భూములు కొనుగోలు చేస్తామని సుపారీ గ్యాంగ్ ఏపీ 39 యూకే 3157నంబర్ గల కారులో గద్వాలకు వచ్చారు.
కారులో తేజేశ్వర్ ఎక్కించుకొని పలు ప్రాంతాలు తిరిగి వస్తుండగా, పథకంలో భాగంగా గద్వాల మండలం వీరాపురం శివారులో పరుశరాముడు మొదట కొడవలితో తేజేశ్వర్పై దాడి చేశాడు. ఆ వెంటనే చాకలి రాజు, కుమ్మరి నగేష్ కొడవలి, కత్తితో విచాక్షణా రహితంగా దాడి చేశారు. దీంతో తేజేశ్వర్ కారులోనే మృతి చెందాడు. ఈ విషయాన్ని నగేష్ వాట్సప్ కాల్ ద్వారా తిరుమలరావుకు చెప్పగా, మృతదేహాన్ని పంచలింగాల దగ్గరలో ఉన్న ఒక వెంచర్ వద్దకు తీసుకు రావాల్సిందిగా ఆదేశించాడు.
బీచుపల్లి బ్రిడ్జి మీదుగా వస్తున్న క్రమంలో తేజేశ్వర్ ఫోన్, ల్యాప్టాప్ బ్యాగ్ ను కృష్ణానదిలో పడేశారు. అక్కడకు వచ్చాక తిరుమ లరావు తేజేశ్వర్ మృతదేహాన్ని చూసి నిర్ధారించుకు న్నాడు. అనంతరం వారికి రూ.లక్ష అందజేశాడు. అనంతరం సుపారీ గ్యాంగ్ నంద్యాల సమీపంలోని పాణ్యం మండలంలోని గాలేరు నగరి కెనాల్ సమీపంలోని జమ్ములో తేజేశ్వర్ మృతదేహాన్ని పడేడి కర్నూలుకు వచ్చారు. తిరుమలరావు తండ్రి తిరుపతయ్య ద్వారా 19, 20 తేదీల్లో 2.50 లక్షల నగదు తీసుకున్నారు
జీపీఎస్ ట్రాకర్ అమర్చి.. నిఘా పెట్టి
తేజేశ్వర్ను హత్య చేసేందుకు సుపారీ గ్యాంగ్ పలుమార్లు యత్నించింది. ఈ క్రమంలోనే తిరుమలరావు జీపీఎస్ ట్రాకర్ను కొనుగోలు చేసి ఓ ఇన్ఫార్మర్ సహాయంతో తేజేశ్వర్ బైక్కు అమర్చారు. అప్పటి నుంచి తేజేశ్వర్ విషయాలను నిత్యం తిరుమలరావు ఐశ్వర్యతో తెలుసుకుంటూ ఓ పథకం వేసుకున్నారు. తేజేశ్వర్ను హత్య చేసిన తర్వాత లడాఖ్ లేదా అండమాన్కు వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు.
నిందితులను పట్టుకున్నారిలా..
నన్నూర్ టోల్ప్లాజా వద్ద కారు వెళుతున్న సీసీ ఫుటేజీ, గద్వాలలో కారులో తేజేశ్వర్ను తీసుకెళ్లిన ఫుటేజీ, సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితులను గుర్తించారు. గురువారం పుల్లూర్ చెక్పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో తిరుమలరావు, నగేష్, పరుశరాముడు, చాకలి రాజు కారులో హైదరాబాద్కు పారిపోతుండగా పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
గద్వాలలో ఉంటున్న ఐశ్వర్య, మోహన్, కర్నూలు ఉంటున్న తిరుపతయ్య, సుజాతలను అదుపులోకి తీసుకున్నట్టు ఎస్పీ తెలిపారు. వారి నుంచి హత్యకు వినియోగించిన కారు, రెండు కొడవళ్లు, 10 సెల్ఫోన్లు, రూ.1.20 లక్షలు, కత్తి, జీపీఎస్ ట్రాకర్ స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వివరించారు. కేసులో ఏ1 తిరుమలరావు, ఏ2 ఐశ్వర్య అలియాస్ సహస్ర, ఏ3 కుమ్మరి నగేష్, ఏ4 చాకలి పరుశరాముడు, ఏ5 చాకలి రాజు, ఏ6 మోహన్, ఏ7 తిరుపతయ్య , ఏ8 సుజాత ఉన్నారు.
హత్య కేసు విచారణలో పాల్గొన్న డీఎస్పీ మొగిలయ్య, గద్వాల సీఐ శ్రీను, ఎస్ఐలు కల్యాణ్కుమార్, శ్రీకాంత్, శ్రీహరి, మల్లేష్, నందికర్, శ్రీనువాసులు, అబ్దుల్షుకుర్, సిబ్బంది చంద్రయ్య, కిరణ్కుమార్, రాజుయాదవ్, వీరేష్, రామకృష్ణను ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు.