ఫోన్‌ ట్యాపింగ్‌తో నాకేం సంబంధం? | Former SIB chief T Prabhakar Rao under investigation in phone tapping case | Sakshi
Sakshi News home page

ఫోన్‌ ట్యాపింగ్‌తో నాకేం సంబంధం?

Jun 10 2025 8:56 AM | Updated on Jun 10 2025 10:19 AM

Former SIB chief T Prabhakar Rao under investigation in phone tapping case
  • రివ్యూ కమిటీ సభ్యులను ఎందుకు వదిలేశారు?
  •  నా రాజీనామా తర్వాత రికార్డుల ధ్వంసం జరిగితే నేనెలా బాధ్యుడిని?
  •  సిట్‌ అధికారులను ఎదురు ప్రశ్నించిన ప్రభాకర్‌రావు 
  •  అక్రమ ట్యాపింగ్‌ కేసులో ఏడు గంటల పాటు విచారణ
  •  బుధవారం మరోసారి విచారణకు  రావాలని ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: అక్రమ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఎస్‌ఐబీ) మాజీ చీఫ్‌ టి.ప్రభాకర్‌రావు సిట్‌ అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు. వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్ప డం మాట అటుంచితే.. ఆయనే సిట్‌ అధికారులను ఎదురు ప్రశ్నిస్తున్నారని తెలిసింది. ఆదివారం అమెరికా నుంచి తిరిగి వచ్చిన ప్రభాకర్‌రావు సోమవారం తన న్యాయవాదితో కలిసి సిట్‌ విచారణకు హాజరయ్యారు. 

ఉదయం 11.30 గంటలకు జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌ రెండో అంతస్తులో ఉన్న సిట్‌ కార్యాలయానికి ప్రభాకర్‌రావు చేరుకున్నారు. వెస్ట్‌జోన్‌ డీసీపీ ఎస్‌ఎం విజయ్‌కుమార్, సిట్‌ ఇన్‌చార్జ్‌గా ఉన్న ఏసీపీ పి.వెంకటగిరి నేతృత్వంలోని బృందం ప్రభాకర్‌రావును ప్రశ్నించింది. మధ్యాహ్నం గంటసేపు లంచ్‌ బ్రేక్‌ ఇచ్చి, రాత్రి 7.30 గంటల వరకు ఆయన్ను విచారించారు. ప్రభాకర్‌రావు చెప్పిన వివరాలను ఆయన స్టేట్‌మెంట్‌గా రికార్డు చేసుకున్నారు. బుధవారం మరోసారి విచారణకు రావాల్సిందిగా ప్రభాకర్‌రావుకు పోలీసులు సూచించారు.

వారితో వృత్తిగత బంధమే..
డీఎస్పీగా పని చేసిన ప్రణీత్‌రావు తనవద్ద పని చేశారని, విధి నిర్వహణలో భాగమైన మావోయిస్టులకు సంబంధించిన వ్యవహారాలను మాత్రమే తాము పర్యవేక్షించామని ప్రభాకర్‌రావు చెప్పినట్లు తెలిసింది. తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్‌రావు తదితరులతో తనకు వృత్తిపరమైన సంబంధాలు మాత్రమే ఉన్నాయని స్పష్టంచేసినట్లు సమాచారం. 2023 నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఎస్‌ఐబీ కార్యాలయంలో హార్డ్‌డిస్క్‌ల ధ్వంసంపైనా అధికారులు ప్రభాకర్‌రావును ప్రశ్నించారు. ఆ నెల 30న సాయంత్రం 4 గంటలకే తాను ఎస్‌ఐబీ చీఫ్‌ పోస్టుకు రాజీనామా చేశానని, ఆ వెంటనే కార్యాలయాన్ని విడిచిపెట్టి వెళ్లానని చెప్పిన ప్రభాకర్‌రావు... ఆ తర్వాత రాత్రి 8 గంటల ప్రాంతంలో జరిగిన ప్రభుత్వ ఆస్తుల ధ్వంసంతో తనకు ఎలా సంబంధం ఉంటుందని సిట్‌ అధికారు లను ప్రశ్నించినట్లు తెలిసింది. ఆ హార్డ్‌డిస్క్‌లు ధ్వంసం చేసి, కొత్తవి పెట్టమన్నది ఎవరు? అని పోలీసులు ప్రశ్నించగా... ఆయన నుంచి సరైన స్పందన రాలేదు. ఈ విచారణ మొత్తాన్ని పోలీసులు వీడియో రికార్డింగ్‌ చేశారు. బుధవారం మరోసారి విచారణకు రావాల్సిందిగా ప్రభాకర్‌రావుకు నోటీసులు జారీ చేశారు. 2023 ఎన్నికల సమయంలో వినియోగించిన రెండు సెల్‌ఫోన్లు, ట్యాబ్, మ్యాక్‌బుక్, ల్యాప్‌టాప్‌ తీసుకువచ్చి అప్పగించాలని ఆదేశించారు.

ట్యాపింగ్‌కు నేను అనుమతివ్వలేదు
ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో ఇప్పటివరకు పోలీసులు చేసిన దర్యాప్తు, నిందితులు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా సిట్‌ అధికారులు ప్రభాకర్‌రావును ప్రశ్నించారు. అయి తే, ఆయన మాత్రం ఈ కేసుతో తనకు సంబంధమే లేదని వాదించినట్లు విశ్వసనీయ సమాచారం. ‘అక్రమ ఫోన్‌ ట్యాపింగ్‌తో నాకేం సంబంధం? ఏయే ఫోన్లు ట్యాప్‌ చేయాలి? ఎంత కాలం చేయాలి? ఎందుకు చేయాలి? అనేది ఖరారు చేయడానికి, ఆ వ్యవహారాన్ని పర్యవేక్షించడానికి రివ్యూ కమిటీ ఉంటుంది. ఆ కమి టీలో సభ్యులుగా ఉండే ఉన్నతాధికారులను ఎందుకు వదిలేశారు?’ అని ప్రభాకర్‌ రావు ఎదురు ప్రశ్నించినట్లు తెలిసింది. ఆయా అధికారులను విచారించి, వాంగ్మూ లాలు నమోదు చేశామని పోలీసులు చెప్పగా... ట్యాపింగ్‌కు అనుమతి ఇచ్చింది వారేనని.. తనకు ఏమాత్రం సంబంధం లేదని వాదించినట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: ‘మత్తిచ్చి తెచ్చారు’.. ‘హనీమూన్‌ జంట’ కేసులో మరో ట్విస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement