8,9,10 తేదీల్లో ఫిష్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ | Fish Food Festival under the aegis of Fisheries Department | Sakshi
Sakshi News home page

8,9,10 తేదీల్లో ఫిష్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌

May 18 2023 2:48 AM | Updated on May 18 2023 11:10 AM

Fish Food Festival under the aegis of Fisheries Department - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మృగశిరకార్తె సందర్భంగా వచ్చే నెల 8,9,10 తేదీల్లో మత్య్సశాఖ ఆధ్వర్యంలో ఫిష్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ను ఘనంగా నిర్వహించాలని అధికారులకు మత్య్స, పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఆదేశించారు. ఫిష్‌ పుడ్‌ ఫెస్టివల్‌కు అనువైన ప్రాంతాలను గుర్తించి ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఫిష్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌పై బుధవారం సచివాలయంలో స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ అధర్‌ సిన్హా, మత్స్యశాఖ కమిషనర్‌ లచ్చరాం భూక్యాలతో కలిసి మంత్రి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఫెస్టివల్‌లో 20 నుంచి 30 వరకు వివిధ రకాల చేప వంటకాల స్టాల్స్, విజయ డెయిరీ ఉత్పత్తులతో కూడిన స్టాల్‌ ఉండే విధంగా చూడాలని ఆదేశించారు. ఫెస్టివల్‌ మూడు రోజులపాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు. సమీక్ష సందర్భంగా మత్స్య సహకార సంఘాల సొసైటీ నూతన చైర్మన్‌గా నియమితులైన పిట్టల రవీందర్‌ మంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు.

అంతకుముందు డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ సచివాలయంలో వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్స్‌ (వీఏఎస్‌) అసోసియేషన్‌ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. వీఏఎస్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు మాట్లాడుతూ కొత్త జిల్లాలు, డివిజన్‌లు, మండలాల వారీగా పశుసంవర్ధక శాఖ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోరారు. దీనికి మంత్రి స్పందిస్తూ పశువైద్యుల సమస్యలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీనిచ్చారు.  

Advertisement
 
Advertisement
Advertisement