సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ పాలనలో మరో కీలక ముందడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా గవర్నమెంట్ పాఠశాలల్లో చదువుతున్న 5వ తరగతి నుండి 9వ తరగతి విద్యార్థుల వార్షిక రిపోర్ట్ కార్డులు నేరుగా తల్లిదండ్రులకు చేరాయి. 18 లక్షలకుపైగా విద్యార్ధుల ప్రోగ్రెస్ కార్డులు మీ సేవ ద్వారా నేరుగా పేరెంట్స్ వాట్సాప్ నెంబర్కు విజయవంతంగా పంపిణీ చేసింది.
ఈ విప్లవాత్మక కార్యక్రమాన్ని ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ ఆధ్వర్యంలో మీ సేవ ద్వారా అమలు చేశారు. దీనిద్వారా విద్యార్థుల అకడమిక్ రికార్డులు స్కూల్కు వెళ్లకుండానే.. తక్షణం, సురక్షితంగా, పేపర్లెస్ విధానంలో తల్లిదండ్రులకు అందుబాటులోకి వచ్చాయి.
ఈ రికార్డు ముఖ్యాంశాలు
• 18,00,000+ విద్యార్థుల రిపోర్ట్ కార్డులు డిజిటల్గా పంపిణీ.
• 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు రాష్ట్రవ్యాప్తంగా గవర్నమెంట్ పాఠశాలలు.
•సబ్జెక్టుల వారీగా మార్కులతో పాటు, హాజరుశాతం కూడా నమోదు.
•స్కూల్కి వెళ్లాల్సిన అవసరం లేకుండా సౌకర్యం.
•పూర్తిగా పేపర్లెస్, సురక్షిత విధానం.
ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ప్రతీ విద్యార్థి, తల్లిదండ్రులకు సాంకేతిక సేవలు చేరాలనే లక్ష్యంతో వాట్సాప్ ద్వారా రిపోర్ట్ కార్డులు అందించామని వెల్లడించారు. దీని ద్వారా ఆయా కుటుంబాలకు సమయం, ఖర్చు ఆదా అవుతుందని, ఇది తెలంగాణ డిజిటల్ గవర్నెన్స్కు నిదర్శనమని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ప్రజలకు సులభంగా, వేగవంతమైన సేవలను అందించడంలో మరోసారి విజయవంతం అయిందని ఆయన అన్నారు.


