జగిత్యాల.. ‘జంగ్‌’ సైరన్‌! | Concerns among key Congress leaders over Jeevan Reddy episode | Sakshi
Sakshi News home page

జగిత్యాల.. ‘జంగ్‌’ సైరన్‌!

Apr 19 2026 6:16 AM | Updated on Apr 19 2026 6:16 AM

Concerns among key Congress leaders over Jeevan Reddy episode

జీవన్‌రెడ్డి ఎపిసోడ్‌తో కాంగ్రెస్‌ ముఖ్య నేతల్లో ఆందోళన

ఎవరు, ఎప్పుడు, ఎలాంటి బాంబు పేలుస్తారోనన్న గుబులు 

జిల్లాకు ఒకరిద్దరు అసమ్మతి నేతలున్నారంటున్న పార్టీ వర్గాలు 

వివిధ కారణాలతో పార్టీలో ఇమడలేక.. వీడలేక సతమతం!  

బీఆర్‌ఎస్‌ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలున్న చోట్ల అందరి పరిస్థితీ ఇదే 

జీవన్‌రెడ్డి విషయంలో అధిష్టానం, ముఖ్య నేతలు సరిగా 

వ్యవహరించలేదనే భావన.. భవిష్యత్‌ పరిణామాలపై కలవరం  

సాక్షి, హైదరాబాద్‌: సీనియర్‌ నేత జీవన్‌రెడ్డి పార్టీని వీడటం, అందుకు దారి తీసిన పరిస్థితులు అధికార కాంగ్రెస్‌లో కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. జగిత్యాల వేది కగా చోటు చేసుకున్న ఈ పరిణామం ఎటు తిరిగి ఎటు వెళుతుందోనన్న ఉత్కంఠ ఆ పార్టీ ముఖ్య నేతల్లో కనిపిస్తోంది. అంతర్గత ప్రజాస్వామానికి పెట్టింది పేరయిన పార్టీలో ఎవరు, ఎప్పుడు, ఎలాంటి బాంబు పేలుస్తారో.. ఎన్నికలు సమీపించే కొద్దీ జగిత్యాల అలజడి ఎలాంటి అసమ్మతి సుడిగుండాలను సృష్టిస్తుందోనన్న గుబులు అంతర్గతంగా వ్యక్తమవుతోంది.  

జిల్లాకు ఒకరిద్దరు..!: కాంగ్రెస్‌లో అసంతృప్తులు, అసమ్మతులు సహజం. అయితే రాష్ట్రం పార్టీ అధికారంలో ఉండడం, భవిష్యత్తుపై ఆశలు ఉండడంతో చాలామంది నేతల్లో వివిధ కారణాలతో అసమ్మతి ఉన్నా పంటి బిగువున నెట్టుకొస్తున్నారనే వాదన ఉంది. తమ భవిష్యత్తు ప్రస్తుతానికి గందరగోళంగా ఉన్నా కొంత కాలం తర్వాత అంతా సర్దుకుంటుందనే ఆశతో పార్టీలో ఉండలేక, వెళ్లలేక, సతమతమవుతున్నారు. ఇలాంటి నేతలు జిల్లాకు కనీసం ఒకరిద్దరున్నారని గాం«దీభవన్‌ వర్గాలే అంటున్నాయి. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌ నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్‌లోకి వచ్చామని చెప్పుకుంటున్న నియోజకవర్గాల్లోని నేతలందరిదీ దాదాపు ఇదే పరిస్థితి. సింగాపురం ఇందిర, పి.విజయారెడ్డి, పొదెం వీరయ్య, భిక్షపతి గౌడ్, భీంభరత్, సరితాయాదవ్, కాట శ్రీనివాస్‌గౌడ్, కస్తూరి రాజేందర్‌ లాంటి నాయకులంతా గందరగోళ పరిస్థితుల్లోనే ఉన్నారు. వీరితో కనీసం మాట్లాడే వారు, సర్దిచెప్పేవారు కూడా లేరని అంటున్నారు. పదేళ్ల పాటు పార్టీని అంటి పెట్టుకుని ఉన్నామని, ఇప్పుడు ఏం చేయాలో కూడా పాలుపోవడం లేదని వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఎన్నికల నాటికి తమ దారి తాము చూసుకుంటామనే హెచ్చరికలతో కూడిన అభిప్రాయాలను బయటకు చెప్పకపోయినా అంతర్గతంగా వ్యక్తం చేస్తున్నారు. తమ విషయంలో పార్టీ, నాయకత్వ వ్యవహారశైలిపై నిట్టూరుస్తూనే ఉన్నారు.  

ఆత్మహత్య చేసుకోవాలనిపించిందన్న చిన్నారెడ్డి 
సీనియర్‌ నేత చిన్నారెడ్డిది కూడా జీవన్‌రెడ్డి లాంటి పరిస్థితే. తనకు ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిందనే స్థాయిలో ఆయన తన అసంతృప్తిని వెలిబుచ్చినా పార్టీ నాయకత్వం ఏ మాత్రం సీరియస్‌గా తీసుకోలోదనే విమర్శలున్నాయి. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా గత ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్లు ఆశించి భంగపడినవారు, పోటీ చేసి ఓడిపోయిన వారు, నామినేటెడ్‌ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న నేతలు... ఇలా అనేకమందిలో అసమ్మతి ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొందరిని సముదాయించేందుకు డీసీసీ అధ్యక్షులుగా, కార్పొరేషన్‌ చైర్మన్లుగా నియమించినా లోలోన అసమ్మతి సెగలు మాత్రం అలాగే ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా సమన్వయ లేమి కారణంగానే నాగం జనార్ధన్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య లాంటి నేతలను దూరం చేసుకున్నామంటూ నెమరువేసుకుంటున్నారు. జీవన్‌రెడ్డితో అధిష్టానం చర్చించి ఉంటే బాగుండేదని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి వ్యాఖ్యానించడం, ఎంపీ మల్లు రవి కూడా ఆయన వెళ్లిపోవడం బాధాకరమే అన్న రీతిలో మాట్లాడటం గమనార్హమని చెబుతున్నారు. 

టేకిటీజీగా తీసుకున్నారా? 
వాస్తవానికి జీవన్‌రెడ్డి చాలా రోజులుగా అసంతృప్తి గళం వినిపిస్తున్నారు. 42 సంవత్సరాలుగా పార్టీలో కొనసాగుతున్న తనను కాదని, కనీసం తనకు చెప్పకుండా, తనపై గెలిచిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేను పార్టీలోకి తీసుకున్నప్పుడే ఆయన భగ్గుమన్నారు. అప్పటి నుంచీ సందర్భమెప్పుడొచ్చినా ఆయన అసమ్మతి గళం వినిపిస్తూనే ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్‌ పార్టీలో జగిత్యాల పంచాయతీ నడుస్తూనే ఉంది. చివరకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గాం«దీభవన్‌కు వచ్చి పార్టీ సమావేశంలో పాల్గొనడం, మున్సిపల్‌ ఎన్నికల సమయంలో జరిగిన పరిణామాలు, ఫలితాల అనంతరం పార్టీ తీసుకున్న నిర్ణయం లాంటివి జీవన్‌రెడ్డి సీనియారిటీ, సిన్సియారిటీపై ప్రశ్నలు లేవనెత్తేలా చేశాయనే భావన వ్యక్తమైంది. అయితే జీవన్‌రెడ్డి గురించి పార్టీలో అంతర్గతంగా చాలా చర్చ జరిగింది. 

ముఖ్య నేతలు కలిసినప్పుడు, కరీంనగర్‌ రాజకీయాలు మాట్లాడినప్పుడు, పీఏసీ సమావేశాల్లోనూ ఆయన గురించి ప్రస్తావనలు వచ్చాయి. కానీ ఆయనే సర్దుకుంటారులే అన్న ధీమాతో పాటు ఇప్పుడు బయటకెళ్లి ఏం చేస్తారులే అనే అభిప్రాయమే చివరివరకు కొనసాగింది. పీసీసీ చీఫ్, సీఎం ఇద్దరూ టేకిటీజీ ధోరణిలోనే వెళ్లారనే భావన కొందరు వ్యక్తం చేయడం గమనార్హం. ఏతావాతా జీవన్‌రెడ్డికి సరైన భరోసా లభించలేదు. జగ్గారెడ్డి, మల్లు రవి మాదిరిగానే చివరి నిమిషంలో మంత్రి శ్రీధర్‌బాబు కూడా జీవన్‌రెడ్డిని వెళ్లనివ్వకుండా ఆపాలని పార్టీ నాయకత్వానికి విజ్ఞప్తి చేశారు. చాలామంది నేతలు జీవన్‌రెడ్డిని పార్టీ విడిచిపెట్టదనే అనుకున్నారు. కానీ జీవన్‌రెడ్డి నాలుగు దశాబ్దాల అనుబంధాన్ని వదులుకున్నారు. ఇది బాధాకరమే అయినప్పటికీ తప్పడం లేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. చివరకు బీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement