పర్యాటకాన్ని పెంచేలా హైస్పీడ్‌ రైల్‌ కారిడార్లు | CM Revanth Reddy says High-speed rail corridors to boost tourism | Sakshi
Sakshi News home page

పర్యాటకాన్ని పెంచేలా హైస్పీడ్‌ రైల్‌ కారిడార్లు

Jun 17 2026 5:30 AM | Updated on Jun 17 2026 5:30 AM

CM Revanth Reddy says High-speed rail corridors to boost tourism

అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం

నల్లమల, అనంతగిరి, సోమశిలల్లో బుల్లెట్‌ రైలు స్టేషన్లు 

కాకతీయ చరిత్ర స్ఫురించేలా వరంగల్‌ విమానాశ్రయం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రాన్ని పర్యాటకరంగ పరంగా ప్రమోట్‌ చేసేందుకు వీలుగా హైస్పీడ్‌ రైలు కారిడార్లకు ప్రణాళికలు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌–పుణె కారిడార్‌లో వికారాబాద్‌ అనంతగిరిలో స్టేషన్‌ ఉండాలని, అక్కడి నుంచి ఐటీ హబ్‌కు రవాణా వసతి కల్పించాలని సూచించారు. మంగళవారం రాత్రి ఆయన హైదరాబాద్‌తో అనుసంధానమయ్యే హైస్పీడ్‌ రైల్‌ కారిడార్లు, వరంగల్‌ విమానాశ్రయంపై సమీక్ష నిర్వహించారు. 

నగరం నుంచి బెంగళూరుకు నిర్మించే కారిడార్‌లో ఫ్యూచర్‌ సిటీ స్టేషన్‌ ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని, రాష్ట్రంలో కీలక పర్యాటక స్థలంగా ఎదిగే వీలున్న సోమశిల ప్రాంతంలో, నల్లమల అటవీ ప్రాంతంలోని మన్ననూరు దగ్గర నల్లమల స్టేషన్‌ ఉండాలని సూచించారు. మూడు హైస్పీడ్‌ రైలు కారిడార్లకు శంషాబాద్‌ ప్రాంతం హబ్‌గా ఉండాలన్నారు. వరంగల్‌ నగరంలో త్వరలో పనులు ప్రారంభం కానున్న విమానాశ్రయ భవనం ఆసాంతం కాకతీయ సామ్రాజ్య చరిత్రను స్ఫురణకు తెచ్చేలా డిజైన్లు రూపొందించాలని ఆదేశించారు. విమానాశ్రయం ముందు భారీ ఐలండ్‌ ఉండాలని, అందులో రాణి రుద్రమ, రుద్ర దేవుడు, భారీ నంది విగ్రహాలు కొలువుదీరాలని చెప్పారు.     

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement