ఇంకాస్త కష్టపడి ఉంటే.. | BRS Victory In Municipal Election Result: Telangana | Sakshi
Sakshi News home page

ఇంకాస్త కష్టపడి ఉంటే..

Feb 14 2026 4:47 AM | Updated on Feb 14 2026 4:47 AM

BRS Victory In Municipal Election Result: Telangana

781 వార్డులు/డివిజన్లలో విజయం సాధించిన బీఆర్‌ఎస్‌ 

13 మున్సిపాలిటీలు కైవసం.. ఇతరులు మద్దతిస్తే మరో నాలుగైదు దక్కే చాన్స్‌

సాక్షి, హైదరాబాద్‌: పంచాయతీ ఎన్నికల్లో మాదిరిగానే మున్సిపల్‌ ఎన్నికల్లోనూ ఆ పార్టీ దాదాపు 30 శాతం వార్డులు/డివిజన్లను కైవసం చేసుకుంది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలోని 2,996 వార్డులకు ఎన్నికలు జరగ్గా.. 781 వార్డుల్లో బీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. అయితే ఇంకొద్దిగా కష్టపడితే వార్డుల సంఖ్య కనీసం వెయ్యివరకు చేరేదన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తం అవుతోంది. ప్రత్యేక రాష్ట్రంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో వరుస విజయాలు సొంతం చేసుకున్న ఆ పార్టీ తాజాగా జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ప్రభావాన్ని చూపలేకపోయిందని అంటున్నారు.

2020లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో దాదాపు 1,737 వార్డులను బీఆర్‌ఎస్‌ గెలుచుకోగా.. అప్పట్లో కాంగ్రెస్‌ 589 స్థానాలకే పరిమితమైంది. దీంతో అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌ కంటే ఇప్పుడు తమకు ఎక్కువ స్థానాలు వచ్చాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. దాదాపు 13 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నప్పటికీ ఒక్క కార్పొరేషన్‌లోనూ ప్రభావం చూపలేకపోయింది. అయితే మరికొన్ని చోట్ల సింగిల్‌ లార్జెస్ట్‌ పారీ్టగా అవతరించడం గమనార్హం.

అక్కడ పొత్తులు కుదిరితే మరికొన్ని పీఠాలు దక్కే అవకాశం ఉంటుంది. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తుపై జరగకపోయినా.. బీఆర్‌ఎస్‌ సానుభూతి పరులు 30 శాతానికి పైగా గెలిచారని, ఈ ఎన్నికల్లోనూ వార్డుల పరంగా చూస్తే 30 శాతానికి పైగా విజయం సాధించినట్లు పార్టీ నాయకత్వం చెబుతోంది.  

కీలక నేతల ప్రాంతాల్లో చెక్కుచెదరని పట్టు 
ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అధిష్టానం పూర్తిస్థాయిలో ప్రచారం చేయలేకపోయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ అధినేత కేసీఆర్‌ ప్రచారానికి పూర్తి దూరంగా ఉన్నారు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్‌ కార్నర్‌ మీటింగ్‌లు, ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ పరిమిత ప్రాంతాల్లోనే పర్యటించారు. పార్టీలో కీలక నేతగా ఉన్న హరీశ్‌రావు సైతం సొంత ప్రాంతంలోనే ప్రచారం చేశారు. అదే సమయంలో కాంగ్రెస్‌ తరఫున సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, పార్టీ నేతలు సీరియస్‌గా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 

మరోవైపు బీజేపీ నాయకత్వం కూడా ఎన్నికల్లో దూకుడుగా పని చేసిందని అంటున్నారు. కానీ బీఆర్‌ఎస్‌కు.. క్షేత్రస్థాయిలో కేడర్‌ ఉన్నప్పటికీ బడా నేతల ఆర్భాటం లేకపోవడంతో మైనస్‌ అయ్యిందనే భావన వ్యక్తమవుతోంది. మరోవైపు సిట్టింగ్‌లకు సీట్లు ఇచ్చారనే అసంతృప్తి, ఫలితంగా సమన్వయలోపం లాంటి కారణాలు కూడా బీఆర్‌ఎస్‌ వెనుకబడటానికి కారణమయ్యాయని జిల్లాస్థాయి నేతలు చెబుతున్నారు. అయితే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో పట్టు నిలుపుకోవడం గమనార్హం.  

అగ్రనేతల్లో సంతృప్తి 
ప్రస్తుతం ఎన్నికలు జరిగిన స్థానాల్లో పావువంతుకు పైగా సీట్లలో విజయం సాధించడంపై బీఆర్‌ఎస్‌ అగ్రనాయకత్వం సంతృప్తి వ్యక్తం చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు సాధారణంగా అధికారపార్టీ ఖాతాలోనే పడతాయని, కానీ పావువంతు సీట్లు ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్‌ఎస్‌కు దక్కడం ఆ పార్టీ బలాన్ని స్పష్టం చేస్తోందని కేటీఆర్‌ స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో ప్రతిపక్ష స్థానంలో ఉన్న కాంగ్రెస్‌ సాధించిన సీట్ల కంటే ఇప్పుడు బీఆర్‌ఎస్‌కు ఎక్కువ వచ్చాయంటూ ఇతర నేతలు సైతం సమరి్థంచుకుంటున్నారు. నారాయణపేట జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్‌ రెబెల్స్‌ విజయం సాధించారు. బీఆర్‌ఎస్‌ నుంచి బయటకు వచి్చన కేసీఆర్‌ కుమార్తె కవిత మద్దతుదారులు ఈ మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement