సింగిల్‌గా పోటీ చేసి గెలుస్తాం!: బండి సంజయ్‌ | Bandi Sanjay Said Elections Karnataka And Telangana So Different | Sakshi
Sakshi News home page

సింగిల్‌గా పోటీ చేసి గెలుస్తాం!: బండి సంజయ్‌

May 22 2023 1:08 PM | Updated on May 22 2023 3:10 PM

Bandi Sanjay Said Elections Karnataka And Telangana So Different - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కర్ణాటక విజయంతో కాంగ్రెస్‌ పార్టీలో నూతనోత్సాహం నెలకొంది. ఈ ప్రభావంతో తెలంగాణలో కూడా కాంగ్రెస్‌ పుంజుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు పావులు కదుపుతున్నారు కూడా. అయితే ఆ ప్రభావం ఏమి తెలంగాణ ఎన్నికల్లో ఉండదని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ఎన్నికలకు తెలంగాణ ఎన్నికల సంబంధమే లేదని తేల్చి చెప్పారు. కర్ణాటక ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాంగ్రెస్‌కి ఫండింగ్‌ ఇచ్చారని ఆరోపించారు

అక్కడ జేడీఎస్‌ నేతల ఫోన్‌లు కూడా ఎత్తలేదన్నారు. కేసీఆర్‌ ఒక విశ్వాస ఘాతుకుడని ఘాటుగా విమర్శించారు. అదే సమయంలో కర్ణాటకలో బీజేపీ ఓటు శాతం కూడా ఏమి తగ్గలేదని, అన్ని పార్టీలు కలిసి బీజేపీని ఢీ కొట్టడంతోనే కాంగ్రెస్‌ గెలుపు ఖాయమైందన్నారు. ఆ ఎన్నికల్లో జేడీఎస్‌ ఓట్లు కాంగ్రెస్‌ వైపు మళ్లించి కేసీఆర్‌ కాంగ్రెస్‌ని లేపే ప్రయత్నం చేశారని ఎద్దేవా చేశారు. అయినా తెలంగాణ ఎన్నికల్లో హైదరాబాద్‌, వరంగల్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎన్ని గెలించిందో చెప్పండని ప్రశ్నించారు.

అలాగే దుబ్బాక, హుజురాబాద్‌, మునుగోడులో కాంగ్రెస్‌ పార్టీకి కనీసం డిపాజిట్‌ రాలేదన్నారు. ఆ టైంలో కాంగ్రెస్‌ కంటే బీజేపీ ఎక్కువ సీట్లు సాధించిందని చెప్పారు. అలాగే మునుగోడులో కాంగ్రెస్‌ అభ్యర్థి తరుఫున బీఆర్‌ఎస్‌ డబ్బులు పంచిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కి ఓటు వేస్తే బీఆర్‌ఎస్‌ పార్టీకి వేసినట్లేనని చెప్పారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా గెలుపు తమదేనని,  ఎన్నికల్లో తాము సింగిల్‌గా పోటీ చేసి అధికారంలోకి రావడం ఖాయమని ధీమాగా చెప్పారు బండి సంజయ్‌.

(చదవండి: కొత్త రేషన్‌ కార్డులు ఇప్పట్లో లేనట్టే!)

Advertisement
 
Advertisement
Advertisement