సాక్షి, వరంగల్: నర్సంపేట మండలం ముత్తోజిపేట గ్రామంలో శుక్రవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ భౌతిక కాయానికి నివాళులర్పించి.. ఆయన కుటుంబాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ పరామర్శించారు. ఆ సమయంలో శంకర్ మృతదేహాన్ని డిపో వరకూ తీసుకెళ్తామని కార్మికులు ఆయనతో అన్నారు. అయితే పోలీసులు అందుకు ఒప్పుకోకపోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది.

ఇదే విషయమై ఆర్టీసీ కార్మికులకు ఉదయం పోలీసులు అభ్యంతరం చెప్పారు. ఆ సమయంలోనూ ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. కార్మికులను అరెస్ట్ చేసిన పోలీసులు.. శంకర్గౌడ్ ఇంటి వద్ద వేసిన టెంట్ను సైతం తొలగించారు. కాసేపటికి కేంద్ర మంత్రి బండి సంజయ్ అక్కడికి వచ్చారు.
ఆ సమయంలోనూ కార్మికులు అదే డిమాండ్ చేశారు. డిపో వద్ద తమ తోటి కార్మికుడి మృతదేహానికి నివాళులర్పించేందుకు అనుమతించాలని పోలీసులను కోరారు. అందుకు అనుమతి ఇవ్వకపోవడంతో పోలీసుల వైఖరిని బండి సంజయ్ తప్పుబట్టారు. ఎవరు అడ్డుకుంటారో చూస్తాం.. మీరు తీసుకెళ్లండి అని కార్మికులతో అన్నారాయన. ఆ సమయంలో పోలీసులు భారీగా మోహరించడంతో అక్కడ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మరోవైపు కొందరు కార్మికులు, బీజేపీ కార్యకర్తలు పోలీసులను దాటుకుని రోడ్డుపై శంకర్ గౌడ్ మృతదేహాన్ని నెట్టుకుంటూ తరలించే ప్రయత్నం చేశారు.
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. నిన్న సమ్మె రెండు రోజు జరగ్గా.. నర్సంపేట డిపోలో డ్రైవర్గా పని చేసే కోలా శంకర్గౌడ్ ప్రభుత్వ తీరుకు నిరసగా పెట్రోల్ పోసుకుని నిప్పటించుకున్నాడు. తీవ్ర గాయాలతో(80 శాతం) హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి సమయంలో కన్నుమూశాడు. పోస్ట్మార్టం అనంతరం శంకర్ గౌడ్ మృతదేహాన్ని స్వస్థలం ముత్తోజీపేట పోలీసులు తరలించారు.


