సాక్షి, చైన్నె : ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మూడవ శనివారం అంతర్జాతీయ బీచ్ శుభ్రతా దినోత్సవం పాటిస్తున్న విషయం తెలిసిందే. . ఈ ప్రత్యేక దినోత్సవాన్ని పురస్కరించుకుని చైన్నెతో పాటుగా రాష్ట్రంలోని ప్రసిద్ధ బీచ్లలో శుభ్రతా కార్యక్రమాలు నిర్వహించారు.చైన్నె మెరీనా తీరంలో ఈ కార్యక్రమాన్ని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ప్రారంభించారు. స్వయంగా ఆయన పాల్గొని, పాఠశాల విద్యార్థులు యువతతో కలిసి బీచ్ను శుభ్రపరిచే కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.
గవర్నర్ సందేశం
ఈ సందర్భంగా గవర్నర్ ఆర్లేకర్ విలేకరులతో మాట్లాడుతూ ,‘‘సముద్రతీరాన్ని , పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవడం మనందరికీ ఒక సహజ అలవాటుగా మారాలి. పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణను కేవలం ఒక రోజుకే పరిమితం చేయకుండా, నిరంతర ఉమ్మడి ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలి’’ అని పిలుపునిచ్చారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన మెరీనా బీచ్ను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవాలని, తీరప్రాంతాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని ఆయన కోరారు.
తీరప్రాంత రక్షక దళం ఆధ్వర్యంలో...
అంతర్జాతీయ బీచ్ శుభ్రతా దినోత్సవాన్ని పురస్కరించుకుని, చైన్నె ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్ కోస్ట్ గార్డ్ ఈశాన్య ప్రాంతీయ ప్రధాన కార్యాలయం ఆధ్వర్యంలో తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతాల్లో భారీ ఎత్తున తీర ప్రాంత శుభ్రతా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. స్వచ్ఛమైన సముద్రం, సురక్షితమైన తీరం, మన గుర్తింపు అనే ప్రధాన నినాదంతో ఈ కార్యక్రమం జరిగింది.


