డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్
ఆవేదన
ఘనంగా డీఎంకే ముప్పెరుం విళా
సాక్షి, చైన్నె : నాలుగు నెలల కాలంలో తమిళనాడు ఆర్థికంగా, అభివృద్ధిపరంగా 25 ఏళ్లు వెనక్కి వెళ్లిందని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఆవేదన వ్యక్తం చేశారు. తేనాం పేటలోని అన్నా అరివాలయం కలైంజ్ఞర్ అరంగం వేదికగా డీఎంకే ముప్పెరుం విళా శనివారం సాయంత్రం జరిగింది. డీఎంకే ఆవిర్భావం, దివంగత అన్నాదురై జయంతి, పెరియార్ జయంతి వేడకను ముప్పెరుం విళాగా నిర్వహించారు. అన్నా, కలైంజ్ఞర్ కరుణానిధి, పెరియార్ చిత్ర పటాలకు ఈ వేదికపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ నివాళులర్పించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ, డీఎంకే చూడని గెలుపు ఓటములు లేవని, ఒక రాజకీయ పార్టీ 75 ఏళ్లు మనుగడ సాగించడం సాధారణ విషయం కాదని పేర్కొన్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా డీఎంకే అదే గౌరవంతో నిలిచిందని ఆయన స్పష్టం చేశారు. టీవీకే పాలనలో తమిళనాడు 25 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని స్టాలిన్ తన ప్రసంగంలో ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో సీఎం విజయ్కు సరైన శ్రద్ధ లేదని, జ్యోతిష్యుడు చెప్పింది చేస్తే చాలని ఆయన భావిస్తున్నారని ఆరోపించారు. తన మిసా చట్టం అరెస్టును కించపరస్తున్నారని పేర్కొంటూ, ఈ అరెస్టు గురించి ఎవరికి తాను నిరూపించుకోవాల్సిన అవశ్యం లేదన్నారు. తన త్యాగానికి మార్కులు ఇచ్చే అర్హత ఎవ్వడికీ లేదన్నారు.
పురస్కారాలు
ఈ వేడుకలలో వివిధ విభాగాల్లో 2026 సంవత్సరానికి గాను పురస్కారాలు ప్రదానం చేశారు. ఈమేరకు పెరియార్ అవార్డు– రైతు విభాగం డిప్యూటీ సెక్రటరీ చెల్లప్ప, అన్నా అవార్డు – సేలం సెంట్రల్ జిల్లా ప్రెసిడెంట్ సేలం జి.కె. సుభాష్, కలైజ్ఞర్ అవార్డు– పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ తిరుచ్చి శివా, పావేందర్ అవార్డు– మెడికల్ వింగ్ ప్రెసిడెంట్ కనిమొళి ఎన్.వి.ఎన్. సోము, పేరాసిరియర్ అవార్డు– హై పవర్ వర్కింగ్ కమిటీ మెంబర్ మిసా ఎస్. అహ్మద్ తంబి, ఎంకే స్టాలిన్ అవార్డు – యువజన విభాగం డిప్యూటీ సెక్రటరీ ఎన్ ఇళయరాజా, మురసోలి సెల్వం అవార్డు– ప్రముఖ జర్నలిస్ట్, రచయిత పి. తిరుమావేలన్లకు స్టాలిన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఎంకే కోశాధికారి టీఆర్బాలు, డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కనిమొళి కరుణానిధి , కేఎన్ నెహ్రు, ఐ పెరియస్వామి, పొన్ముడి తదితరులు పాల్గొన్నారు.
కొళత్తూరు ఓటర్లకు కోట్లాది దండాలు
దశాబ్దాల ఘన చరిత్ర కలిగిన రాష్ట్ర అసెంబ్లీలో తాజాగా జరుగుతున్న పరిణామాలు వేదన కలిగిస్తున్నాయన్నారు. ఈ మేరకు రీల్స్ మోహంలో పడ్డ ఈ పాలకులు వ్యవహరిస్తున్నరని మండిపడ్డారు. ఈ ఘోరాన్ని అంతా తాను అసెంబ్లీలో కూర్చుని కనులారా చూడకుండా చేసినందుకు , వాస్తవానికి కొళత్తూరు ఓటర్లకు కోట్లాది దండాలు..కృతజ్ఞతలు అని ఉద్వేగంగా వ్యాఖ్యలు చేశారు. ఆ మేరకు అసెంబ్లీ చరిత్రను దిగజార్చే పాలన వ్యవహారాలు జరుగుతున్నాయని మండి పడ్డారు. ఇక, ఈ వేదికపై డీఎంకే ప్రధాన కార్యదర్శి దురై మురుగన్ మాట్లాడుతూ, డీఎంకే ఓటమికి కృంగిపోదని పేర్కొంటూ, ఈ సారి కాస్త ఏమర పాటుగా ఉండబట్టే మోస పోయామన్నారు. ఉప ఎన్నికలలో గెలుపుతో డీఎంకే అంటే ఏమిటో చాటుదామని , ప్రతి కేడర్, నాయకుడు ఉప ఎన్నికలలో అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గెలుపును పార్టీ అధ్యక్షుడు స్టాలిన్కు కానుకగా అందజేద్దామన్నారు.
25 ఏళ్లు వెనక్కి తమిళనాడు


