సాక్షి, చైన్నె: శాసనసభ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా, ప్రతి 2 అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒక జిల్లా గా తీర్చిదిద్దారు. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న 77 మంది జిల్లా కార్యదర్శులు, కొత్తగా రూపుదిద్దుకున్న 110 జిల్లాల పరిధిలోని యూనియన్లు, నగరాలు, టౌన్ పంచాయతీల విభజనపై కార్యవర్గ సమావేశాలు నిర్వహించి 15 రోజుల్లోగా అధిష్టానానికి సిఫార్సులు పంపాల్సి ఉంది. దీంతో ఆ కసరత్తులు వేగంగా జరుగుతున్నాయి. అలాగే, డిఎంకెలో సాధారణంగా పార్టీ ఎన్నికల ద్వారా జిల్లా కార్యదర్శులను ఎన్నుకుంటారు. అంతవరకు సంబంధిత జిల్లాల వ్యవహారాలను పర్యవేక్షించేందుకు తాత్కాలిక ఇన్ఛార్జులను నియమించడం జరుగుతుంది. దీంతో ఇన్చార్జ్ల జాబితా కసరత్తులలో స్టాలిన్ నిమగ్నమయ్యారు.
సీనియర్లకు చెక్
ఇప్పటికే వయో పరిమితుల నేపథ్యంలో 15 మందికి పైగా సీనియర్లకు ఇక, జిల్లాలో అవకాశాలు లేదన్నది తేలింది. అలాగే, మరి కొందరు ముఖ్య నేతలు, మాజీ మంత్రులకు సైతం స్టాలిన్ చెక్ పెట్టబోతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఆమేరకు మదురైలో నలుగురు మాజీ మంత్రులు , ముఖ్య నేతలు ఉన్న దృష్ట్యా, వీరిలో ఏదో ఒకరిద్దరికి జిల్లాలో అవకాశం ఇచ్చి, మిగిలిన వారికి చెక్ పెట్టడం లేదా, రాష్ట్ర స్థాయి పదవులలోకి తీసుకునే దిశగా కసరత్తులలో ఉన్నట్టు సమాచారాలు వెలువడ్డాయి.అలాగే, చైన్నెలో మాజీ మంత్రులు పి.కె. శేఖర్బాబు, ఎం సుబ్రమణ్యం, మాజీ ఎమ్మెల్యే టీ వేలుతో సహా పలువురు సీనియర్లకు స్టాలిన్ చెక్ పెట్టేబోతున్నట్టు సమాచారాలు వెలువడ్డాయి.రాజధాని రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా వెలిగిన మాజీ మంత్రి పి.కె. శేఖర్బాబు అధికార పరిధిని తగ్గించేలా పార్టీ నాయకత్వం చర్యలు చేపట్టినట్లు అరివాలయం వర్గాల ద్వారా సమాచారం. ఇక డీఎంకే కంచు కోటగా చైన్నె ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడ 16 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. తాజాగా ఇక్కడ రెండు చోట్లే గెలిచారు. స్టాలిన్ సైతం కొళత్తూరులో ఓటమి పాలయ్యారు. దీనిపై పార్టీ నాయకత్వం నిర్వహించిన క్షేత్రస్థాయి విచారణలో, చైన్నె ఈస్ట్ జిల్లా కార్యదర్శిగా ఉన్న శేఖర్బాబు నిర్లక్ష్య వైఖరి వల్లే కొళత్తూర్ నియోజకవర్గంలో ఓటమి, చైన్నె అంతటా పార్టీ వెనుక బడినట్టు తేలినట్టు సమాచారం. దీంతో ఆయన అధికారాలను కుదించాలని నాయకత్వం నిర్ణయించిందన్న చర్చ జరుగుతోంది. ఇదే రీతిలో మాజీ మంత్రి ఎం సుబ్రమణ్యం, మాజీ ఎమ్మెల్యే మైలై వేలు, మాధవరం సుదర్శనం వంటి సీనియర్ నాయకులకు కూడా ప్రతిబంధకాలు ఎదురుకానున్నాయి. ఉదయనిధి స్టాలిన్ మద్దతుదారులైన కే.పి.శంకర్ (తిరువత్తియూర్, ఆర్.కె.నగర్), పరంధామన్ (విల్లివాక్కం, ఎగ్మోర్), యువజన విభాగం నిర్వాహకుడు ప్రభాకర్ రాజా (విరుగంబాక్కం, మదురవాయల్)కు కొత్త బాధ్యతలు అప్పగించే యోచనలో అధిష్టానం ఉన్నట్టుగా డీఎంకే కార్యాలయం అన్నా అరివాలయం వర్గాలు పేర్కొంటున్నాయి.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పరాజయం తదుపరి పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు డీఎంకే చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా భారీ సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పార్టీ జిల్లాల సంఖ్యను 77 నుంచి 110కి పెంచుతూ డీఎంకే అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా ఏర్పడిన ఈ 110 జిల్లాలకు త్వరలోనే ఇన్ఛార్జులను నియమించనున్నారు. వారిని సెప్టెంబర్ 17న నిర్వహించనున్న డీఎంకే ముప్పెరుం విళా వేదికగా ఎం.కె. స్టాలిన్ పరిచయం చేయనున్నారు.
ముప్పెరుం విళా పరిచయం
ఈ 110 మంది జిల్లా ఇన్ఛార్జులందరినీ సెప్టెంబర్ 17న జరగబోయే ముప్పెరుం విళా కార్యక్రమంలో ఎం.కె. స్టాలిన్ పార్టీ శ్రేణులకు పరిచయం చేయనున్నారు. ఈ వేడుక జరిగే ప్రాంతం, వేదికను త్వరలోనే ప్రకటించనున్నారు. డీఎంకేలో పార్టీ ఆవిర్భావోత్సవం, అన్నా జయంతి, పెరియార్ జయంతిలను ముప్పెంరు విళాగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే.


