రామమందిర నిర్మాణానికి విదేశీ నిధులు రాలేదా? | - | Sakshi
Sakshi News home page

రామమందిర నిర్మాణానికి విదేశీ నిధులు రాలేదా?

Aug 31 2026 12:50 AM | Updated on Aug 31 2026 12:50 AM

– పి. చిదంబరం కీలక వ్యాఖ్యలు

సాక్షి, చైన్నె : ‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విదేశీ విరాళాల నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చిందని, ఈ చట్టం 1976 నుండి అమల్లో ఉందని పేర్కొంటూ, ఇదే చట్టం ప్రకారం అయోధ్య రామమందిర నిర్మాణానికి ప్రపంచవ్యాప్తంగా విదేశీ నిధులు రాలేదా? అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి చిదరంబరం ప్రశ్నించారు. రామమందిరానికి విదేశాల నుండి నిధులు రావడం లేనిది, ఇక్కడి ముస్లిం, క్రైస్తవ సంస్థలకు విదేశీయులు నిధులు ఇస్తే తప్పేంటి? అని కేంద్రాన్ని ప్రశ్నించారు. మదురైలోని అలగర్‌కోవిల్‌ రోడ్డులో ఉన్న తమిళనాడు హోటల్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ‘పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో ఏం జరిగింది?’ అనే అంశంపై బహిరంగ చర్చా కార్యక్రమం జరిగింది. ఈ సమావేశానికి నగర జిల్లా అధ్యక్షుడు పూ. నల్లమణి అధ్యక్షత వహించగా, ఎంపీలు పి. చిదంబరం, సు. వెంకటేశన్‌ (సిపిఎం), కె. నవాజ్‌ ఖని (ఐయుఎంఎల్‌) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

బిల్లుల ఆమోదంపై విమర్శ

కేంద్ర బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్‌లో చర్చలు లేకుండానే అనేక బిల్లులను ఆమోదిస్తున్నదని చిదంబరం ఆరోపించారు. పోటీ పరీక్షల్లో అక్రమాల నిరోధక చట్టం తెచ్చినప్పటికీ, నిత్యం విదేశీ, స్వదేశీ పరీక్షల రద్దు వార్తలు వస్తూనే ఉన్నాయన్నారు. ఇటువంటి ఉపయోగం లేని చట్టాలను చర్చ లేకుండా ఆమోదించి గొప్పలు చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. 1947కు ముందు హిందూ మహాసభ, ఆర్‌ఎస్‌ఎస్‌, జనసంఘ్‌లకు వందేమాతరం లేదా త్రివర్ణ పతాకం విలువ తెలియదని, ఆర్‌ఎస్‌ఎస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో గత 12 ఏళ్లుగా మాత్రమే జాతీయ జెండాను ఎగురవేస్తున్నారని గుర్తుచేశారు. చరిత్ర తెలియనివారు ఇటువంటి చట్టాలను తెస్తున్నారని వ్యాఖ్యానించారు.

నియోజకవర్గాల పునర్విభజన

1971 నాటికి తమిళనాడుకు 41 ఎంపీ స్థానాలు ఉండేవి, జనాభా ప్రాతిపదికన అవి 39కి తగ్గాయన్నారు. జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలు నష్టపోకూడదని నాటి ప్రధాని ఇందిరా గాంధీ 1976లో 25 ఏళ్ల పాటు స్థానాల సంఖ్య మారకుండా చట్టం తెచ్చారని, 2001లో వాజ్‌పేయ్‌ప్రభుత్వం కూడా దీనిని మరో 25 ఏళ్లు పొడిగించిందని గుర్తుచేశారు. ఈ నియోజకవర్గాల పునర్విభజన ముసుగులో దక్షిణాది ప్రాతినిధ్యాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారని, దీనికి వ్యతిరేకంగా కలసి పోరాడటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంపీల సమావేశం ఏర్పాటు చేసినప్పుడు తొలుత డిఎంకె దూరంగా ఉండటం విచారకరమని, అయితే ఆ తర్వాత అసెంబ్లీలో తీర్మానాన్ని మద్దతు ఇచ్చినందుకు ఎం.కె. స్టాలిన్‌ను అభినందిస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం టీవీకే, డీఎంకే, కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్‌ ఒకే తాటిపై ఉన్నాయని, అయితే అన్నాడీఎంకే మాత్రం దీనికి భిన్నంగా మాట్లాడటం అర్థరహితమని మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement