పోలీస్‌ శాఖలో సీసీటీఎన్‌ఎస్‌ 2.0 కష్టాలు | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ శాఖలో సీసీటీఎన్‌ఎస్‌ 2.0 కష్టాలు

Jul 10 2026 5:22 AM | Updated on Jul 10 2026 5:22 AM

సాక్షి,చైన్నె: తమిళనాడు పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదుల నమోదు, ఎఫ్‌ఐఆర్‌ అప్‌లోడ్‌ వంటి పనులను వేగవంతం చేయడానికి తీసుకొచ్చిన సీసీటీఎన్‌ఎస్‌ 2.0 కొత్త సాఫ్ట్‌వేర్‌ వల్ల ప్రస్తుతం పోలీసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆధునిక సాఫ్ట్‌వేర్‌ ఉన్నప్పటికీ, దానికి తగిన ఇంటర్నెట్‌ వేగం లేకపోవడమే దీనికి ప్రధాన కారణం.

మందగించిన ఇంటర్నెట్‌ వేగం: ఒక ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి కనీసం అర గంట సమయం పడుతోందని తిరుచ్చి నగర పోలీస్‌ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘ఏనుగును కొన్నారు కానీ, అంకుశం కొనడానికి డబ్బులు లేవు‘ అన్న సామెతలా ఈ పరిస్థితి ఉందని వారు పేర్కొన్నారు. ఇక భద్రతా కారణాల దృష్ట్యా ప్రతి దశలోనూ దర్యాప్తు అధికారి ఆమోదం కోసం ఓటీపీ పంపబడుతుంది. ఆయన అనుమతి లభించిన తర్వాతే తదుపరి వివరాలను నమోదు చేయాల్సి రావడం వల్ల కాలయాపన జరుగుతోంది.

ఆధార్‌ నమోదు నిబంధన

ఫిర్యాదుదారుల ఆధార్‌ వివరాలను నమోదు చేయడం తప్పనిసరి చేయడం పెద్ద అడ్డంకిగా మారింది. గతంలో నేరస్థుల పాత కేసులను వారి పేరు, తండ్రి పేరుతో సులభంగా వెతకడానికి వీలుండేది. కానీ ఇప్పుడు ఆధార్‌ వంటి వివరాలు ఉంటేనే పాత రికార్డులు లభ్యమవుతున్నాయని చెబుతున్నారు.

సాఫ్ట్‌వేర్‌ ప్రయోజనాలు

ఈ సాఫ్ట్‌వేర్‌ జాతీయ స్థాయి నేర న్యాయ వ్యవస్థతో అనుసంధానించారు. దీని ద్వారా ప్రజలు తమ ఫిర్యాదుల స్థితిని ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు. అలాగే పోలీస్‌ వెరిఫికేషన్‌, టెనెంట్‌ వెరిఫికేషన్‌ వంటి సేవలను స్టేషన్‌కు వెళ్లకుండానే పొందవచ్చు.

పోలీసుల విజ్ఞప్తి

ఈ సాఫ్ట్‌వేర్‌ నిర్వహణలో ఎదురవుతున్న సాంకేతిక లోపాలను, మౌలిక వసతుల కొరతను సరిచేసి, దీనిని సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి అవసరమైన వేగవంతమైన ఇంటర్నెట్‌, ఇతర వసతులను కల్పించాలని తమిళనాడు ముఖ్యమంత్రి, పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్‌లను పోలీసులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement