సాక్షి, చైన్నె :మహిళల్లో శారీరక దఢత్వం, ఆరోగ్యంపై అవగాహన కల్పించడమే ధ్యేయంగా దేశవ్యాప్తంగా సాగుతున్న అతిపెద్ద మహిళల పరుగు పందెం ’జైడస్ పింకాథాన్’ ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ చైన్నె నగరానికి తిరిగి వస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక లోగో, వివరాలను గురువారం చైన్నెలో జరిగిన విలేకరుల సమావేశంలో నిర్వాహకులు ప్రతిష్టాత్మకంగా విడుదల చేశారు. ఆగస్టు 1, 2 తేదీల్లో చైన్నెలోని ఐలాండ్ గ్రౌండ్స్ వేదికగా ఈ పరుగు పందెం జరగనుంది. అన్ని వయసుల, అన్ని వర్గాల మహిళలు పాల్గొనేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఇందులో సాధారణ 3 కి.మీ, 5 కి.మీ, 10 కి.మీ విభాగాలతో పాటు.. అత్యంత కఠినమైన 50 కి.మీ, 75 కి.మీ, 100 కి.మీ అల్ట్రా మారథాన్లు, 100 కి.మీ రిలే రన్ వంటి వివిధ విభాగాలు ఉన్నాయి. ఈవెంట్ ద్వారా ది ఈసియస్ట్ ఎగ్జామ్ పేరిట రొమ్ము క్యాన్సర్ ముందస్తు గుర్తింపుపై ప్రత్యేక ప్రచారాన్ని నిర్వహిస్తున్నామని జైడస్ లైఫ్సైన్సెస్ ఎండీ డాక్టర్ శర్విల్ పటేల్ , పింకాథాన్ వ్యవస్థాపకుడు మిలింద్ సోమన్లు ప్రకటించారు.


