సాక్షి, చైన్నె: తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న అనూహ్య మార్పులు, ముఖ్యంగా 17వ శాసనసభలో చోటుచేసుకున్న పరిణామాలు.. ఇందులో సీనియర్ రాజకీయవేత్త కే.ఏ.సెంగోట్టయ్యన్ పోషిస్తున్న పాత్ర కీలకంగా మారింది. విజయ్ కేబినెట్లో రాజగురువుగా కే.ఏ.సెంగోట్టయ్యన్ మారి ఉన్నారు. తమిళనాడు రాజకీయాల్లో 50 ఏళ్ల అనుభవం ఉన్న సెంగోట్టయ్యన్, నూతన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ప్రభుత్వంలో చేరడం ఒక చారిత్రాత్మక మలుపుగా మారింది.
అనుభవానికి పట్టం
ఎంజీఆర్ కాలం నుండి నేటి విజయ్ వరకు ఐదుగురు ముఖ్యమంత్రులతో పనిచేసే అవకాశం సెంగోట్టయన్కు వచ్చింది. వరుస విజయాలతో దూసుకొస్తున్న సెంగోట్టయన్కు తాజాగా టీవీకే పట్టం కట్టింది. దివంగత ఎంజీఆర్తో సఖ్యతగా సెంగోట్టయన్ మెలిగారు. ఆయన మరణానంతరం జయలలితకు అండగా నిలిచారు. జయలలిత సంక్లిష్ట కాలంలో జైలుకు వెళ్లాల్సి వస్తే, ఆసమయంలో సీఎంగా బాధ్యతలు చేపట్టిన పన్నీరు సెల్వంకు సహకారంగా నిలిచారు. ఇక, జయలలిత మరణం తదుపరి పరిణామాలతో సీఎంగా పళణిస్వామి పగ్గాలు చేపట్టిన పక్షంలో ఆయనకు వెన్నంటి ఉన్నారు. అయితే, చివరకు ఐదు దశాబ్దాలుగా రాజకీయ ప్రయాణం సాగించిన పార్టీని వీడాల్సిన పరిస్థితి ఆయనకు అన్నాడీఎంకేలో ఎదురైంది. అక్కడి నుంచి టీవీకే విజయ్ పక్షాన చేరిన ఆయన ఆ పార్టీకే రాజగురువుగా అవతరించారు. ప్రమాణ స్వీకార వేదికపై సెంగోట్టయ్యన్ ప్రమాణం చేస్తున్నప్పుడు సీఎం విజయ్, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గౌరవపూర్వకంగా లేచి నిలబడటం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం. ఒక సీనియర్ నాయకుడికి నవతరం ఇస్తున్న గౌరవంగా దీన్ని చూడవచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. విజయ్ రాజకీయ కార్యక్రమాలు విస్తృతం చేసిన సమయంలో సెంగోట్టయ్యన్ చేరికపై విమర్శలు వచ్చినా, ఆయన తన రాజకీయ అనుభవంతో విజయ్ను అధికారం దిశగా నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. అందుకే ఆయనను టీవీకేకు ‘రాజగురువు’గాఅందరూ అభిర్ణించే పనిలో పడటం విశేషం.


