తిరుత్తణి: జాతీయ రహదారిపై సబ్వే నిర్మించాలనే డిమాండ్తో శవం తరలించే వాహనంతో గ్రామీణులు రాస్తారోకో చేపట్టడంతో సోమవారం చైన్నె–తిరుపతి జాతీయ రహదారిపై వాహన సేవలు స్తంభించాయి. తిరుత్తణి సమీపంలోని చైన్నె తిరుపతీ జాతీయ రహదారి విస్తరణ పనులు నిర్వహిస్తున్నారు. దీంతో జాతీయ రహదారికి సమీపంలోని గ్రామాలకు నేరుగా వెళ్లే మార్గాలు లేక రెండు కి.మీ దూరం వెళ్లి రావాల్సి ఉంది. ఈ క్రమంలో జాతీయ రహదారికి సమీపంలోని జ్ఞానమంగళం కండ్రిగ గ్రామంలో వృద్ధుడు వయోభారంతో మృతి చెందాడు. అతని అంతిమయాత్ర సోమవారం సాయంత్రం నిర్వహించారు. గ్రామం నుంచి శ్మశానానికి వెళ్లాలంటే జాతీయ రహదారి క్రాస్ చేసుకుని వెళాల్సి ఉంది. అయితే జాతీయ రహదారి విస్తరించి రోడ్డుకు మధ్యలో సెంటర్ మీడియన్తో శ్మశానానికి రెండు కి.మీ దూరం వెళ్లి తిరిగి రావాల్సి ఉండడంతో ఆగ్రహం చెందిన గ్రామస్తులు శవం తరలించిన వాహనం రోడ్డుపై ఉంచి రాస్తారోకో చేపట్టారు. దీంతో వాహన సేవలు స్తంభించాయి. వెంటనే కనకమ్మసత్రం పోలీసులు రంగ ప్రవేశం చేసి గ్రామీణులతో మాట్లాడారు. జాతీయ రహదారిలో శ్మశానానికి వెళ్లేందుకు వీలుగా సబ్వే ఏర్పాటు చేస్తామని హామీ మేరకు గంటపాటు నిర్వహించిన రాస్తారోకో విరమించారు. దీంతో ప్రయాణికులు, వాహన చోదకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.


