శక్తిఅమ్మ సేవా కార్యక్రమాలు అభినందనీయం
● శక్తిఅమ్మ జయంతి వేడుకల్లో కలుసుకోవడం సంతోషం ● ఉపరాష్ట్రపతి సీపీ రాధాక్రిష్ణన్
వేలూరు: మానవునిగా జన్మించడమే అతిపెద్ద పుణ్యం ఫలంగా భావించాలని ప్రతి ఒక్కరూ భక్తితో ఉంటే మంచి ఆలోచనలతో పాటు ఆరోగ్యంగానూ, సంతోషంగా జీవించ వచ్చని పీఠాధిపతి శక్తిఅమ్మ అన్నారు. వేలూరు బంగారుగుడి, శ్రీనారాయణి పీఠం పీఠాధిపతి శక్తిఅమ్మ 50వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్ర రాష్ట్ర మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పలువురు శక్తిఅమ్మ భక్తులు హాజరై శక్తిఅమ్మకు పుష్పాభిషేకం చేశారు. ఇక ముఖ్యఅతిథిగా హాజరైన ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ మాట్లాడుతూ తాను శక్తిఅమ్మ జన్మదినోత్సవంలో కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఏ నమ్మకంతో వివిధ దేశాల నుంచి భక్తులు ఇక్కడకు వచ్చారో అదే నమ్మకంతోనే తాను వేలూరుకు వచ్చినప్పుడల్లా బంగారుగుడిని సందర్శించి శక్తిఅమ్మ ఆశీస్సులు తీసుకుంటానన్నారు. శ్రీపురంలోని బంగారుగుడికి ఇది వరకే మాజీ రాష్ట్రపతులు అబ్దల్ కలాం, రామ్నాథ్ కోవింద్లతో పాటు ద్రౌపది ముర్మ వచ్చి వెళ్లడం అందరికీ తెలిసిందే అన్నారు. ఈ మార్గలి మాసంలో 1976 జనవరి 3వ తేదిన వేలూరు కోట జలకంఠేశ్వరాలయంలో శక్తిఅమ్మ జన్మించి ఆయన 16 సంవత్సరాల వయస్సులోనే నారాయణి పీఠం సృష్టించారన్నారు. ప్రధాని నరేంద్రమోదీ కూడా బంగారుగుడికి వచ్చి శక్తిఅమ్మ ఆశీస్సులు అందుకున్నారన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగాను, సంతోషంగాను ఉండాలన్నదే శక్తిఅమ్మ ధ్యేయమన్నారు. పూర్తిగా బంగారంతో ఉన్న ఈ ఆలయం పంజాబ్లోని బంగారుగుడి ఒకటిగా ఉంటే శ్రీపురంలో ఉన్నది దేశంలోనే రెండవ బంగారుగుడిగా గుర్తింపు సాధించిందన్నారు. శక్తిఅమ్మ 1,500 కిలోల బంగారంతో ఈ ఆలయాన్ని నిర్మించి చరిత్ర సృష్టించే స్థలంగా మార్చారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఆలయాలకు కుంభాభిషేకం చేయడం, భక్తులకు పలు సేవా కార్యక్రమాలు చేయడం, నిరుపేద విద్యార్థులకు విద్యా స్కాలర్షిప్లు అందజేయడం, పేదలకు సాయం చేయడం వంటి ధర్మ కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. రోజూ భక్తులందరికీ ఉచిత అన్నదానం చేయడం, పర్యావరణం కోసం చెట్లు నాటడం వంటి గ్రామీణ ప్రాంత ప్రజలకు అవసరమైన సేవలు చే స్తున్నారన్నారు. కరోనా కాలంలోను ప్రజలకు అవసరమైన నిత్యవసర వస్తువులు అందజేశారన్నారు. బంగారుగుడి పీఠాధిపతి శక్తిఅమ్మ మాట్లాడుతూ మనం మానవ జన్మగా జన్మించడం ఎంతో గొప్ప విషయమని వీటిని సద్వినియోగం చేసుకొని ఇతరులకు సాయం చేయాలనే తపన ప్రతి ఒక్కరికీ రావాలన్నారు. ప్రేమ, భక్తి ఉంటే దైవ సన్నదికి చేరవచ్చునని ఇందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలన్నారు. ప్రతి మానవుడు కష్టాన్ని తలిచి బాధపడకుండా భక్తితో ధర్మం, ఇతరులకు సాయం చేసేందుకు ముందుకు రావాలని అప్పుడే మంచి ఆలోచనలు శారీరక బలం వస్తుందన్నారు. అనంతరం ఉపరాష్ట్రపతికి కామదేను విగ్రహాన్ని పీఠాధిపతి శక్తిఅమ్మ అందజేశారు.
బంగారుగుడిలో కిటకిట లాడిన భక్తులు
ఘన స్వాగతం
వేలూరు బంగారుగుడికి ప్రత్యేక హెలికాప్టర్లో వచ్చిన ఉప రాష్ట్రపతికి వేలూరులో రాష్ట్ర ఆదిద్రావిడ సంక్షేమ శాఖ మంత్రి మదివేందన్, కలెక్టర్ సుబ్బలక్ష్మి పుష్ప గుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు. అదేవిధంగా ఎస్పీ మయిల్వాగణన్ ఆధ్వర్యంలో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
శ్రీపురం బంగారుగుడి పీఠాధిపతి శక్తిఅమ్మ 50వ జన్మదినోత్సవం శనివారం ఉదయం అంగరంగ వైభవంగా జరిగింది. అందులో భాగంగా ఉదయం 5 గంటలకు పీఠంలో శ్రీ గణపతి యాగం, సర్వ మంగళ నారాయణి హోమం, ఆయూష్ హోమం, 11 గంటలకు పూర్ణాహుతి, శక్తిఅమ్మకు వేద మంత్రాల నడుమ పాద పూజ, పలు పుష్పాలతో అభిషేకం, మంగళ హారతి జరిగింది. అనంతరం వివిధ పీఠాల నుంచి తీసుకొచ్చిన ప్రసాదాలను భక్తులకు అందజేశారు. ఈ పూజా కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట్ర మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు శక్తి అమ్మకు పాదాభివందనం చేసి శక్తిఅమ్మ ఆశీస్సులు అందుకున్నారు. టీటీడీ ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యులు నందకుమార్ అద్యక్షతన టీటీడీ ఆలయ అధికారులు వేద పండితులు వేద మంత్రాలు చదివి తిరుమల స్వామి వారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం వివిధ పీఠాల నుంచి పీఠాధిపతులు స్వామి వారి ప్రసాదాలను శక్తి అమ్మకు అందజేశారు. కార్యక్రమంలో కేంద్ర మత్రి ఎల్. మురుగన్, మాజీ ఎంపీ ఏసీ షణ్ముగం, పీఠాధిపతులు కలవై సచ్చిదానంద స్వామిజీ, వాలాజ దన్వంతరి ఆరోగ్య పీఠం పీఠాధిపతి మురళీధర స్వామిజీ, కంచి లలితాంబిగై పీఠాధిపతి శ్రీ బాలానంద స్వామిజీ, బంగారుగుడి మేనేజర్ సంపత్, నారాయణి ఆసుపత్రి డైరెక్టర్ బాలాజీ, బంగారుగుడి డైరెక్టర్ సురేష్కుమార్, ఎమ్మెల్యే కార్తికేయన్, మేయర్ సుజాత, వివిధ దేశాలకు చెందిన శక్తిఅమ్మ భక్తులు పాల్గొన్నారు.
శక్తిఅమ్మ సేవా కార్యక్రమాలు అభినందనీయం
శక్తిఅమ్మ సేవా కార్యక్రమాలు అభినందనీయం


