చైన్నె– ఢిల్లీ విమానాలు రద్దు | - | Sakshi
Sakshi News home page

చైన్నె– ఢిల్లీ విమానాలు రద్దు

Jun 19 2025 4:28 AM | Updated on Jun 19 2025 4:28 AM

చైన్న

చైన్నె– ఢిల్లీ విమానాలు రద్దు

కొరుక్కుపేట: చైన్నె– ఢిల్లీ మధ్య నడిచే రెండు ఎయిర్‌ ఇండియా విమానాలను అధికారులు రద్దు చేశారు. చైన్నె నుంచి ఢిల్లీకి ఒక విమానం, ఢిల్లీ నుంచి చైన్నెకి వచ్చే ఒక విమానం నడుస్తున్నాయి. ఈక్రమంలో బుధవారం రెండు ఎయిర్‌ ఇండియా ప్యాసింజర్‌ విమానాలు రద్దు చేశారు. అలాగే చైన్నె నుంచి సింగపూర్‌కు వెళ్లే ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ ప్యాసింజర్‌ విమానం ఉదయం 6 గంటలకు ఆలస్యంగా బయలుదేరింది. దీని కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బుధవారం సాయంత్రం 4:13 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరాల్సిన ఎయిర్‌ ఇండియా ప్యాసింజర్‌ విమానం, రాత్రి 8.40 గంటలకు చైన్నె నుంచి బయలుదేరాల్సిన ఎయిర్‌ ఇండియా ప్యాసింజర్‌ విమానం రద్దు చేశారు. అలాగే బుధవారం ఉదయం 5 గంటలకు చైన్నె నుంచి బయలుదేరి సింగపూర్‌ వెళ్లాల్సిన ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ ప్యాసింజర్‌ విమానం ఆరు గంటలు ఆలస్యంగా ఉదయం 11 గంటలకు చైన్నె నుంచి సింగపూర్‌కు బయలుదేరింది. ఫలితంగా సింగపూర్‌ వెళ్లాల్సిన 252 మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

22న క్లాట్‌ ప్రెప్‌ స్కాలర్‌షిప్‌ పరీక్ష

సాక్షి, చైన్నె:జూన్‌ 22న సీపీఎస్‌ఏటీ (క్లాట్‌ ప్రెప్‌ స్కాలర్‌షిప్‌, అడ్మిషన్‌టెస్ట్‌)ను నిర్వహించనున్నామని టైమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ బుధవారం ప్రకటించింది. స్థానికంగా ఈ పరీక్ష వివరాలను పేర్కొంటూ, టైమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ 2026–27 విద్యా సంవత్సరంలో క్లాట్‌ అభ్యర్థుల కోసం ఈ పరీక్షను ఉచితంగా నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. జూన్‌ 22న ఆదివారం రెండు స్లాట్‌లలో ఉదయం 10, సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్నామని వివరించారు. ఆన్‌లైన్‌లో గంటపాటు జరిగే ఈ పరీక్షలో 60 బహుళ ఎంపిక ప్రశ్నలు ఉంటాయని తెలిపారు. ప్రస్తుతం ప్లస్‌ ఒన్‌, ప్లస్‌టూ చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులుగా ప్రకటిస్తూ, ఔత్సాహికులు తమ పేర్లను టైమ్‌ 4 ఎడ్యుకేషన్‌. కామ్‌ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చని సూచించారు.

కులగణన డైరెక్టర్‌గా

సుందరేష్‌బాబు

సాక్షి, చైన్నె: తమిళనాడుతోపాటు పుదుచ్చేరిలో కులాల వారీగా జనభా లెక్కింపునకు సంబంధించి పర్యవేక్షణ విభాగం డైరెక్టర్‌గా ఐఏఎస్‌ అధికారి సుందరేష్‌బాబు నియమితులయ్యారు. ఈమేరకు కేంద్రం బుధవారం ప్రకటించింది. దేశ వ్యాప్తంగా 2011లో జనగణన రాష్ట్రంలో జరిగింది. ఆ తర్వాత 2021లో జరగాల్సి ఉన్నా, కరోనా రూపంలో వాయిదా పడింది. ఎట్టకేలకు జనాభా లెక్కింపునకు కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకుంది. అయితే, కులాల వారీగా జనాభా లెక్కింపునకు ఈ సారి నిర్ణయించి చర్యలు తీసుకున్నారు. 2027 మార్చి ఒకటి నాటికి ఈ ప్రక్రియను ముగించే దిశగా కేంద్రం కార్యాచరణ సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగా జనగణన విభాగానికి సంబంధించి అధికారుల నియామక ప్రక్రియ జరుగుతోంది. జిల్లాల కలెక్టర్లు ప్రాఽథమిక జనాభా గణన అధికారులుగా వ్యవహరించనున్నారు. ఈ పరిస్థితుల్లో తమిళనాడు, పుదుచ్చేరిలో ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రత్యేక డైరెక్టర్‌గా ఎం.సుందరేష్‌ బాబును నియమించారు. 2012 బ్యాచ్‌ కర్నాటక కేడర్‌కు చెందిన ఈ అధికారి ప్రాథమిక పనులను పర్యవేక్షించనున్నారు. ఈ ఏడాది చివరి వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.

నటుడు ఆర్య ఇంట్లో సోదాలు

తమిళసినిమా(చైన్నె): బహుభాషా నటుడిగా రాణిస్తున్న ఆర్య నిర్మాతగానూ చిత్రాలు చేస్తున్నారు. ఇటీవల ఈయన సంతానం కథానాయకుడిగా డెవిల్స్‌ డబుల్‌ అనే చిత్రాన్ని నిర్మించారు. అంతేకాకుండా ఆర్య ఇతర వ్యాపార రంగాలనూ నిర్వహిస్తున్నారు. ఈయనకు చైన్నెలోనే ఐదు హోటళ్లు ఉన్నట్లు సమాచారం. స్థానిక అన్నానగర్‌లో సీషెల్స్‌ అనే హోటల్‌తోపాటు కీల్పాక్కం, కొట్టివాక్కమ్‌, వేలచ్చేరి ల్లోనూ హోటళ్లను ఆర్య నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ హోటళ్లలో ఆదాయపన్నుకు సంబంధించిన ఆరోపణలు రావడంతో ఐటీ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం వైరల్‌ అయ్యింది.

హోటళ్లకు నాకు ఎలాంటి సంబంధం లేదు

అయితే ఐటీ దాడుల ప్రచారంపై ఆర్య స్పంధించారు. ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు జరుగుతున్న హోటళ్లకు తనకు ఎలాంటి సంబంధం లేదని, వాటి నిర్వాహకులు వేరేవారని ఆయన మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఆర్య ఇంతకుముందే తన హోటళ్లను కేర ళాకు చెందిన కున్హీ మసా అనే వ్యక్తికి విక్రయించినట్లు సమాచారం

చైన్నె– ఢిల్లీ విమానాలు రద్దు 
1
1/1

చైన్నె– ఢిల్లీ విమానాలు రద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement