సమ్మెకు ఉపాధ్యాయ
సంఘాల సమాయత్తం
తిరువొత్తియూరు: రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాల సభ్యులు టీచర్ల డిమాండ్లు సాధన కోసం సమ్మెకు సమాయత్తం అవుతున్నారు. తమిళనాడు ప్రాథమిక విద్య ఉపాధ్యాయుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ డిటోజాక్ ఫోరం రాష్ట్ర జనరల్ కమిటీ సమావేశం బుధవారం ఉదయం 11 గంటలకు చైన్నెలో జరిగింది. ఈ సమావేశానికి తమిళనాడు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల కూటమి రాష్ట్ర ఉన్నత స్థాయి కమిటీ సభ్యుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మానస మయిల్ అధ్యక్షత వహించారు. అనుబంధ సంఘాల తరఫున అన్ని రాష్ట్ర ఉన్నతస్థాయి కమిటీ సభ్యులు, రాష్ట్ర జనరల్ కమిటీ సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు. సెకండరీ స్కూల్ టీచర్ల జీతాల వ్యత్యాసాలను తొలగించి, వారికి కేంద్ర ప్రభుత్వ జీతాలకు సమానమైన జీతాలు అందించడం, పాత పెన్షన్ పథకాన్ని క్రమబద్ధీకరించడం, ప్రభుత్వ ఉత్తర్వు నంబర్ 243ని రద్దు చేయడం, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల జీతాల పెంపు అంశంపై సమావేశంలో చర్చించారు. ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా ఉన్న పరీక్ష కేంద్రాలకు రూ. 5,400, రూ.5,700 గ్రేడ్ పేపై విధించిన అన్ని తప్పుడు నివేదికలపై ఆంక్షలను వెంటనే రద్దు చేయాలని నొక్కి చెబుతూ, నిరసన చర్యలు చేపట్టాలని డిటోజాక్ రాష్ట్ర జనరల్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఈ మేరకు జూలై 5, 6 తేదీల్లో జిల్లాస్థాయి నిరసన సన్నాహక సమావేశాలు నిర్వహించాలని, జూలై 7 నుంచి 11వ తేదీ వరకు 5 రోజుల ఉపాధ్యాయ సమావేశ ప్రచారం నిర్వహించాలని సూచించారు. అలాగే జూలై 16 నుంచి 18వ తేదీ వరకు 3 రోజుల పాటు జిల్లా రాజధానుల్లో నిరంతర నిరసన నిర్వహించాలని నిర్ణయించారు. ఆగస్టు 8న చైన్నెలోని సెక్రటేరియేట్ ఎదుట ఆందోళన చేపట్టాలని కూడా నిర్ణయించారు.
ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
తిరుత్తణి: కాంగ్రెస్ నేత, రాహుల్గాంధీ పుట్టినరోజు వేడుకలను తిరుత్తణిలో గురువారం వేడుకగా నిర్వహించారు. తిరుత్తణి పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రామకృష్ణన్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గోవిందరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు త్యాగరాజన్ పాల్గొని, స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని రాజీవ్గాంధీ విగ్రహానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. అనంతరం రాహుల్గాంధీ జన్మదినం సందర్భంగా అన్నదానం పంపిణీ చేశారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నోటు పుస్తకాలు, విద్యా సామగ్రి అందజేశారు. కాంగ్రెస్ పళ్లిపట్టు పట్ణణ అధ్యక్షుడు శివకుమార్ అధ్యక్షతన పళ్లిపట్టులో వేడుకలు నిర్వహించి, స్వీట్లు పంచిపెట్టి, అన్నదానం చేశారు. అలాగే ఆర్కేపేట, అమ్మ యార్కుప్పం, అత్తిమాంజేరిపేట, పొదటూరుపేట, కేజీ.కండ్రిగ సహా పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ శ్రేణులు రాహుల్గాంధీ పుట్టిన రోజు వేడుకలు వాడవాడలా కోలాహలంగా జరుపుకున్నారు.
స్మగ్లింగ్ కేసులో యువకుడి అరెస్టు
అన్నానగర్: విదేశాల నుంచి చైన్నె బంగారం అక్రమంగా రవాణాలో ప్రధాన సూత్రధారిగా వ్యవహరించిన చైన్నె యువకుడిని మీనంబాక్కం విమానాశ్రయంలో అధికారులు అరెస్టు చేశారు. చైన్నెకి చెందిన 32 ఏళ్ల వ్యక్తికి అరబ్ దేశాల నుంచి చైన్నెకి బంగారాన్ని అక్రమంగా రవాణా చేసేవాడు. కొన్ని రోజుల క్రితం ఆ యువకుడు ఇండిగో విమానంలో రూ.2 కోట్ల విలువైన బంగారాన్ని అక్రమంగా రవాణా చేశాడు. ఆ విమానం ముంబయికి వెళ్లాల్సి ఉండగా, ఆ యువకుడు తన సీటు కింద బంగారాన్ని దాచిపెట్టి, విమానం దిగి, చైన్నెకి తిరిగి వచ్చాడు. తర్వాత తాను ప్రయాణిస్తున్న విమానం ఎక్కడికి వెళుతుందో నిరంతరం పర్యవేక్షించాడు. 14వ తేదీన బంగారం తీసుకెళుతున్న విమానం కోల్కతా నుంచి చైన్నెకి వస్తోందని గుర్తించిన ఆ యువకుడు 13వ తేదీన చైన్నె నుంచి కోల్కతాకు వెళ్లాడు. మరుసటి రోజు బంగారం తీసుకెళుతున్న విమానంలో టికెట్ కొనుక్కుని చైన్నెకి ప్రయాణించాడు. అక్రమంగా తరలించిన బంగారంతో అబుదాబి నుంచి వచ్చినప్పుడు తీసుకున్న సీటునే ఎంచుకున్న చైన్నె యువకుడు, తరువాత సీటు కింద దాచిపెట్టిన 2.30 కిలోల బంగారాన్ని రహస్యంగా బయటకు తీసి తన బ్యాగులో దాచుకున్నాడు. చైన్నె మీనంబాక్కం విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత, అతడు విమానం దిగి, బయటకు రావడానికి యత్నించాడు. కానీ విమానాశ్రయ కస్టమ్స్ అధికారులు స్మగ్లర్ను చుట్టుముట్టి, అతని వస్తువులను తనిఖీ చేశారు. ఆ సమయంలో అధికారులు అతని బ్యాగ్లో బంగారం ఉండడం గుర్తించి, దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేశారు.
10 మంది రౌడీల అరెస్టు
తిరువొత్తియూరు: చైన్నెలో పోలీస్ కమిషనర్ అరుణ ఆదేశాల మేరకు పోలీసులు సంఘ విద్రోహ శక్తుల నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పరారీలో ఉన్న రౌడీలను అరెస్టు చేసేందుకు పులియాంతోపు, ఒట్టేరి ప్రాంతాల్లో నిఘా పెట్టారు. ఒట్టేరికి చెందిన రౌడీ పరోటా శీను సహా 10 మంది రౌడీలను అరెస్టు చేశారు. కోయంబేడుకు చెందిన రౌడీ ధనంచెలియన్, ఒట్టేరి రాకేష్ సహా 10 మంది రౌడీల నుంచి కత్తులు, కొడవళ్లు వంటి మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు.