
సీఐటీయూ ఆధర్యంలో ధర్నా
తిరువళ్లూరు: ప్రైవేటు కంపెనీ నుంచి తొలగించిన కార్మికులను వెంటనే విధులోకి తీసుకోవాలని, పెండింగ్ వేతనాలను చెల్లించాలని కోరుతూ ప్రైవేటు ఫర్నీచర్ కంపెనీకి చెందిన కార్మికులు, సీఐటూయూ నేతలు గురువారం పట్రపెరంబదూరు టోల్గేటు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మేల్యే సౌందరరాజన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పోర్ట్ ఫర్నీచర్ కంపెనీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం సౌందరరాజన్ మాట్లాడుతూ ప్రైవేటు కంపెనీలో తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, పెండింగ్ వేతనాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులను సమస్యలను పరిస్కరించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం సరికాదన్నారు. అనంతరం కంపెనీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో సీఐటీయూ నేతలు విజయన్, రాజేంద్రన్, నిత్యానందం కార్మిక సంఘాలకు చెందిన నేతలు తమిళరసు, గణేషన్, శంకర్, మురుగన్, కలైయరసన్ పాల్గొన్నారు.