టాస్మాక్‌ స్కాంలో.. సర్కారుకు షాక్‌! | - | Sakshi
Sakshi News home page

టాస్మాక్‌ స్కాంలో.. సర్కారుకు షాక్‌!

Apr 24 2025 1:35 AM | Updated on Apr 24 2025 1:35 AM

టాస్మాక్‌ స్కాంలో.. సర్కారుకు షాక్‌!

టాస్మాక్‌ స్కాంలో.. సర్కారుకు షాక్‌!

సాక్షి, చైన్నె: టాస్మాక్‌ ప్రధాన కార్యాలయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సోదాలు ఇక మరింత విస్తృతం కానున్నాయి. అధికారులను సైతం విచారించే అవకాశాలు ఉన్నాయి. ఇందుకు కారణం టాస్మాక్‌, ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు తిరస్కరిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. వివరాలు.. చైన్నెలోని టాస్మాక్‌ ప్రధాన కార్యాలయంలో గత నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మూడు రోజులు ఈడీ సోదాలు జరిగిన విషయం తెలిసిందే. మద్యం విక్రయాలలో అక్రమాలు జరిగినట్టుగా పేర్కొంటూ ఈ సోదాలు జరిగాయి. ఈ సోదాలలో రూ. 1000 కోట్ల మేరకు అక్రమాలకు సంబంధించిన ఆధారాలు ఈడీకి చిక్కినట్టు సమాచారాలు వెలువడ్డాయి. టాస్మాక్‌ అధికారులు తమకు కావాల్సిన వారికి బార్‌ లైసెన్సులు జారీ చేసినట్టు, ఇందులో పెద్దఎత్తున నగదు చేతులు మారినట్టుగా ఈడీ గుర్తించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈ వ్యవహారాన్ని ప్రతిపక్షాలు అస్త్రంగా చేసుకుని అసెంబ్లీలో సైతం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా ముందుకెళ్లాయి. అదే సమయంలో ఈడీ తదుపరి అడుగులు వేయడానికి సిద్దమైనట్టు సంకేతాలు వెలువడ్డాయి. టాస్మాక్‌ అధికారులను విచారించే దిశగా ఈడీ సిద్ధమవుతున్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. దీంతో ప్రభుత్వం, టాస్మాక్‌ తరపున మూడు పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. చట్ట విరుద్దంగా టాస్మాక్‌ కార్యాలయంలో సోదాలు జరపడమే కాకుండా,అధికారులు, సిబ్బందిని విచారణ, సోదాల పేరిట వేదిస్తున్నట్టు వాదనలు కోర్టుకు చేరాయి. సోదాల సమయంలో మహిళా అధికారిణులు తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యారన్నటాస్మాక్‌ తరపున వాదన కేసులో కీలకంగా మారింది. అదే సమయంలో తొలుత ఓ బెంచ్‌, ఆతర్వాత మరో బెంచ్‌ కేసును విచారించడంతో ఉత్కంఠ నెలకొంది. చివరకు సోమవారం విచారణను ముగించిన న్యాయమూర్తులు ఎస్‌ఎం సుబ్రమణియన్‌, రాజశేఖరన్‌ బెంచ్‌ బుధవారం తీర్పు వెలువరించింది.

ఈడీ విచారణకు గ్రీన్‌ సిగ్నల్‌ హైకోర్టు తీర్పుతో ఇక మరింత దూకుడు

ఇక, ఈడీ దూకుడు తథ్యం..

ఈడీకి అనుకూలంగా న్యాయమూర్తులు తీర్పు వెలువరించారు. ఈడీ తరపు వాదనలను పరిగణిస్తున్నట్టు పేర్కొన్నారు. 1000 కోట్ల మేరకు మనీ లాండరింగ్‌ జరిగినట్టు ఈడీ పేర్కొని ఉండడం, దేశ ప్రయోజనాల దృష్ట్యా కేసును ముందుకు తీసుకెళ్లే అవకాశం ఈడీకి కల్పిస్తున్నట్టు ఆదేశించారు. రాజకీయ అంశాల పరంగా వివాదాల జోలికి తాము వెళ్లబోమని, మనీ లాండరింగ్‌ జరిగినట్టు ఈడీ పేర్కొన్న అంశాలు, ఆధారాల మేరకు టాస్మాక్‌, ప్రభుత్వం తరపున దాఖలు చేసిన పిటిషన్లను తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. ఈడీ ఈ కేసును మరింత ముందుకు తీసుకెళ్ల వచ్చు అని కోర్టు సూచించడంతో ఇక, దూకుడు పెంచేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ కేసులో మంత్రి సెంథిల్‌ బాలాజీ, టాస్మాక్‌ అధికారులను తొలి విడతగా ఈడీ టార్గెట్‌ చేయనున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement