
అసెంబ్లీలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి స్టాలిన్
సాక్షి, చైన్నె: అల్లర్లు, కుల, మతఘర్షణలు, తుపాకీ కాల్పులు, లాకప్ డెత్లు వంటి ఘటనలకు చోటులేకుండా రాష్ట్రం శాంతివనంగా మారిందని సీఎం ఎంకే స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. స్కాట్లాండ్ పోలీసులతో సమానంగా తమిళనాడు పోలీసుల పనితీరు ఉందని కొనియాడారు. పోలీసు, అగ్నిమాపక శాఖల బలోపేతం లక్ష్యంగా 101 వరాలను అసెంబ్లీ వేదికగా సీఎం ప్రకటించారు.
అసెంబ్లీ సమావేశాలలో భాగంగా శుక్రవారం పోలీసు, అగ్నిమాపక శాఖలకు నిధుల కేటాయింపులపై సీఎం స్టాలిన్ ప్రసంగించారు. సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. రాష్ట్ర పోలీసు యంత్రాంగం పనితీరును పొగడ్తలతో ముంచెత్తారు. నేరాల కట్టడిలో, నేరగాళ్లను పట్టుకోవడంలో పోలీసులు విశిష్ట ప్రతిభ కనబరుస్తున్నారని వివరించారు. అన్నాడీఎంకే హయాంలో రాష్ట్రంలో గంజాయి వంటి మాదక ద్రవ్యాల విక్రయం రాష్ట్రంలో జోరుగా సాగిందని, వీటిని కట్టడి చేయడం లక్ష్యగా తాము తీవ్రంగా శ్రమిస్తున్నామని పేర్కొన్నారు. తూత్తుకుడిలో జరిగిన తుపాకీ కాల్పులకు అనుమతి ఎవరు ఇచ్చారో అనే ప్రశ్నకు ఇక్కడ సమాధానం ఇచ్చే వారు లేరని మాజీ సీఎం పళని స్వామిని ఉద్దేశించి విమర్శలు చేశారు. కొడనాడు కేసు విచారణపై పళనిస్వామికి ఎ ందుకు అంత తడబాటో అర్థం కావడం లేదని, సీబీసీఐడీ విచారణలో వాస్తవాలు త్వరలో వెలుగులోకి రాబోతున్నాయని సీఎం వ్యాఖ్యలు చేశారు. వలస కార్మికులను అడ్డం పెట్టుకుని రాష్ట్రంలో అతిపెద్ద అల్లర్లకు కొందరు చేసిన కుట్రలను తమిళనాడు పోలీసు భగ్నం చేశారని, కార్మికుల భద్రతకు భరోసా కల్పించారని గుర్తు చేస్తూ ప్రశంసలు కురిపించారు.
101 వరాలు...
నేరాల కట్టడిలో పోలీసుల పాత్రను గుర్తు చేస్తూ, రాష్ట్రంలో అల్లర్లు, మత, కుల ఘర్షణలు వంటి ఘటనలకు ఆస్కారం ఇవ్వకుండా శాంతివనంగా మారిందని వ్యాఖ్యలు చేశారు. పోలీసులు ఆ విధంగా శ్రమిస్తున్నారని, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించకుండా కఠినంగా వ్యవహరించి శిక్షల పడేలా చేస్తున్నారని పేర్కొన్నారు. అందుకే పోలీసు విభాగాన్ని మరింత బలోపేతం చేయడం, నిఘాపెంపునకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంటూ 101 వరాలను ప్రకటించారు. ఇందులో కొత్త పోలీసుస్టేషన్ల ఏర్పాటు, క్వార్టర్స్ల నిర్మాణాలు, అగ్నిమాపక కేంద్రాల బలోపేతం అంశాలు ఉన్నాయి. అలాగే, చైన్నెలో మహిళలు, బాలికలకు రక్షణగా రూ.5 కోట్లతో 3,500 నిఘా నేత్రాలను ప్రత్యేకంగా కొన్ని చోట్ల ఏర్పాటు చేయనున్నామని ప్రకటించారు. పోలీసులకు ఏడాదికి గాను యూనిఫాం భత్యంగా రూ. 4,500 అందజేస్తామన్నారు. అలాగే, పోలీసు పిల్లలకు విద్యా ప్రోత్సాహకంగా రూ. 35 వేలు అందజేయనున్నామని ప్రకటించారు. పోలీసు శునకాలకు రోజుకు ఆహారం ఖర్చు రూ. 200 నుంచి రూ.300లకు పెంచుతున్నామని తెలిపారు. క్రిష్టో కరెన్సీ, ఆన్లైన్ మోసాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలను కట్టడి చేయడం లక్ష్యంగా ఆయా సంస్థలపై నిఘా వేయడానికి ప్రత్యేక కార్యాచరణపై దృష్టి పెట్టనున్నామని తెలిపారు. ఖైదీలు తప్పించుకోకుండా ఉండే విధంగా రిమోట్ లాక్ సిస్టమ్పై దృష్టి పెట్టనున్నామని వివరించారు. నేరాలకు పాల్పడే వారు ఎవరైనా, ఎంతటి వారైనా సరే ఉపేక్షించమని, శిక్షించి తీరుతామని సీఎం హెచ్చరించారు. ఇదిలా ఉండగా, సీఎం స్టాలిన్ ప్రసంగం వినేందుకుగాను ప్రేక్షకుల గ్యాలరీలో ఆయన సతీమణి దుర్గా స్టాలిన్ ఆశీనులయ్యారు. అలాగే, డీఎంకే పార్లమెంటరీ నేత టీఆర్ బాలు కూడా గ్యాలరీలో నుంచి సభా వ్యవహారాలను వీక్షించారు.
స్పీకర్ ఆవేదన..
అన్నాడీఎంకే తీరుపై స్పీకర్ అప్పావు ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ వ్యవహారాల ప్రత్యక్ష ప్రసారంపై ఇప్పటికే సభా వేదికగా వివరాలను వెల్లడించామని స్పీకర్ గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రశ్నోత్తరాలను మాత్రం ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని, దశల వారీగా అన్నీ కార్యక్రమాలను ప్రసారం చేస్తామన్నారు. సభా వేదికగా అన్నాడీఎంకే సభ్యులు వాడిన పదాలు, చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆవేదనకు గురి చేశాయని, ఇది తప్పుడు సంకేతాలకు మార్గం అవుతుందని పేర్కొన్నారు. తాను కక్ష సాధిస్తున్నట్లుగా అన్నాడీఎంకే వర్గాలు చెప్పడం శోచనీయమని విమర్శించారు. తాను కక్ష సాధించాలనుకుంటే అన్నాడీఎంకే–1, అన్నాడీఎంకే–2 అని వారి శిబిరాలను విభజించి ఉండేవాడినని వ్యాఖ్యలు చేశారు.
అన్నాడీఎంకే వాకౌట్..
సీఎం ప్రసంగాన్ని అన్నాడీఎంకే సభ్యులు వాకౌట్ చేశారు. ప్రధాన ప్రతి పక్ష నేత , అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి ప్రసంగాన్ని సభలో ప్రత్యేక్ష ప్రసారం చేయడం లేదని, శాసన సభా పక్ష ఉపనేత పదవి నుంచి పన్నీరుసెల్వంను తొలగించి ఉదయకుమార్ను నియమించడంలో స్పీకర్ నిర్లక్ష్యం వహిస్తున్నారని, సభా పద్దుల కమిటీని తమకు ఇవ్వకుండా స్పీకర్ రాజకీయం చేశారని ఆరోపిస్తూ సభ నుంచి అన్నాడీఎంకే సభ్యులు వాకౌట్ చేశారు. స్పీకర్ అప్పావు ఏకపక్షంగా సభలో వ్యవహరిస్తున్నారని, తమళగళాన్ని నొక్కేస్తున్నారని ఆ పార్టీ విప్ ఎస్పీ వేలుమణి ఆగ్రహం వ్యక్తం చేశారు.