భానుపురి (సూర్యాపేట) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిర్మాణాలు పూర్తిచేసుకున్న లబ్ధిదారులకు చివరి బిల్లు కోసం ఎదురు చూపులు తప్పడం లేదు. గతంలో ఇంటి మంజూరు కోసం నానా అవస్థలు పడగా.. ప్రస్తుతం ఇంటి నిర్మాణాలు పూర్తయి గృహ ప్రవేశాలు జరిగినా బిల్లులు అందక అంతే తిప్పలు పడుతున్నారు. ప్రధానంగా చివరి బిల్లు కోసం కొందరు ఆరు నెలల నుంచి మరికొందరు ఏడాదిగా నిరీక్షిస్తున్నారు. ఒక్కో ఇంటికి రూ.1.60 లక్షల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ (పీఎంఏవైజీ) ద్వారా చివరి బిల్లు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా.. ఈ నిధుల విడుదలలో
జాప్యమవుతోంది.
అప్పు చేసి ఇళ్ల నిర్మాణం
ఇందిరమ్మ పథకం కింద మంజూరైన ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం నాలుగు విడతల్లో రూ.5 ఆర్థిక సాయం అందిస్తోంది. మొదటి విడత బేస్మెంట్ లెవల్లో రూ.లక్ష, రెండో విడత స్లాబ్ లెవల్లో రూ.లక్ష, మూడోవిడత స్లాబ్ పూర్తి కాగానే రూ.2 లక్షలు, నిర్మాణం పూర్తయిన తర్వాత మిగిలిన రూ.లక్ష ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ కింద రూ.1.60 లక్షలు ఇస్తుండగా.. దీన్ని చివరి లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేస్తూ స్లాబ్ పూర్తయిన తర్వాత ఇచ్చే రూ.2లక్షలను రూ.1.40 లక్షలుగా మార్చారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఇంటి నిర్మాణాలు చేపడుతున్నా.. నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం, కూలీల ఖర్చు అధికంగా ఉండడంతో ప్రభుత్వం విడుదల చేసే మొత్తానికి మించి ఖర్చు అవుతోంది. దీంతో లబ్ధిదారులు బంగారం తాకట్టు పెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో అప్పులు చేసి మరి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకుంటున్నారు. లబ్ధిదారులు ప్రభుత్వం అందించే నిధులకు అదనంగా మరో రూ.5లక్షలకు పైగా వెచ్చిస్తే గానీ ఇంటి నిర్మాణం పూర్తికాలేదు.
నెలలు గడుస్తున్నా ఖాతాల్లో
నగదు జమచేయని ప్రభుత్వం
పీఎంఏవైజీ నిధులు వస్తేనే
బిల్లులు అందే అవకాశం
2 వేల మందికిపైగా లబ్ధిదారుల
ఎదురుచూపు
ఈ చిత్రంలో ఉన్న ఇందిరమ్మ ఇల్లు ఆత్మకూర్ (ఎస్) మండలానికి చెందినది. ఈ ఇంటి నిర్మాణం పూర్తయి
ఆరు నెలలు కావొస్తోంది. దాదాపు రూ.13 లక్షల వరకు వెచ్చించి ఈ ఇంటిని లబ్ధిదారుడు నిర్మించుకున్నాడు.
ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.5 లక్షల్లో ఇప్పటి వరకు కేవలం రూ.3.40 లక్షలే లబ్ధిదారుడికి అందాయి. మిగతా రూ.1.60 లక్షలు బిల్లు కోసం వేచి చూస్తున్నాడు. జిల్లా
అంతటా ఇందిరమ్మ గృహప్రవేశాలు చేసిన
లబ్ధిదారులందరిదీ ఇదే పరిస్థితి నెలకొంది.
2వేలకుపైగా గృహప్రవేశాలు
నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున జిల్లాకు 12,868 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో 2వేలకు పైగా ఇళ్ల గృహ ప్రవేశాలు పూర్తయ్యాయి. ఈ మేరకు అధికారులు సైతం చివరి బిల్లు కోసం ఫోటోను ఆప్లోడ్ సైతం చేశారు. మరో 5వేల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. అధిక భాగంగా ఇళ్లు స్లాబ్ పూర్తయి మరో నెలరోజుల్లో చివరి బిల్లు కోసం సిద్ధమవుతున్నాయి. 2025 జనవరిలో నిర్వహించిన గ్రామసభల్లో మండలానికో గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి 4,140 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి నిర్మాణాలు ప్రారంభించారు. ఇక్కడ నిర్మాణాలు పూర్తయి దాదాపు ఆరు నెలలకు పైగానే అయింది. కానీ వారికి కూడా ఇప్పటి వరకు చివరి బిల్లు పడకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి చివరి బిల్లును మంజూరు చేయాలని గృహప్రవేశాలు చేసిన లబ్ధిదారులు కోరుకుంటున్నారు.


