ధాన్యం కొనుగోలులో రాణించారు | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోలులో రాణించారు

Jun 18 2025 3:53 AM | Updated on Jun 18 2025 3:53 AM

ధాన్యం కొనుగోలులో రాణించారు

ధాన్యం కొనుగోలులో రాణించారు

సూర్యాపేట : మహిళలు మహారాణుల్లా రాణిస్తున్నారు. రంగం ఏదైనా దూసుకుపోతున్నారు. అందుకు సూర్యాపేట జిల్లా స్వయం సహాయక సంఘాల మహిళలే నిదర్శనం. మహిళా శక్తి పేరున ప్రభుత్వం అతివలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుండగా.. ఇదే అవకాశంగా తమ సత్తా చాటుతున్నారు. జిల్లాలో యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లలో మహిళా సంఘాలు రాణించాయి. దాదాపు రూ.409 కోట్ల విలువైన 1,74,909 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని 29,008 మంది రైతుల వద్ద కొనుగోలు చేశాయి. ఈ కొనుగోళ్లతో సుమారు రూ.5.58 కోట్ల మేర కమీషన్‌ను నిర్వాహకులు ఆర్జించారు.

163 కేంద్రాలు మహిళా సంఘాలవే..

సూర్యాపేట జిల్లాలో యాసంగి వరి ధాన్యం 4లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు అమ్మకానికి వస్తుందని అధికారులు భావించారు. ఇందుకు గాను 331 సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే గతంలో 60నుంచి 70 సెంటర్లను మాత్రమే స్వయం సహాయక సంఘాలకు అప్పగించగా.. ఈ సారి ఏకంగా 163 కేంద్రాలను వీరితోనే నడిపించారు. ఈ కేటాయింపులో కలెక్టర్‌ తేజస్‌నంద్‌లాల్‌ పవార్‌ ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఇందిరా మహిళా శక్తి పేరుతో ప్రభుత్వం అవకాశాలిస్తుండగా.. జిల్లాలో ప్రత్యేకంగా స్కూల్‌ యూనిఫాం కుట్టడంలోనూ స్వయం సహాయక సంఘాల మహిళలే సత్తాచాటారు. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లు ఎక్కువగా అప్పగించాలని నిర్ణయించగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని సేకరించారు.

ముందంజలో మహిళా సంఘాలు

జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లలో మహిళా సంఘాలకు చెందిన మహిళలు రాణించారు. 163 కేంద్రాల్లో 29,008 మంది రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేశారు. ధాన్యం కొనుగోళ్లే కాకుండా ఏ రంగంలోనైనా జిల్లా స్వయం సహాయక సంఘాలు ముందంజలో ఉంటున్నాయి.

– వి.వి. అప్పారావు, డీఆర్‌డీఓ

ఫ ధాన్యం సేకరణ ద్వారా మహిళా

సంఘాలకు రూ.5.58కోట్ల కమీషన్‌

ఫ యాసంగిలో దాదాపు రూ.409 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు

ఫ త్వరలో విడుదల కానున్న

కమీషన్‌ డబ్బులు

వివాదాలు లేకుండా..

ప్రతీ సీజన్‌లో ధాన్యం కొనుగోళ్ల విషయంలో వివాదాలు తలెత్తుతూనే ఉంటాయి. ఈ సీజన్‌లో అలా కాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు. మహిళా సంఘాల సభ్యులతో కమిటీలు వేసి ధాన్యం కొనుగోళ్లు చేపట్టారు. ప్రతి ఒక్కరూ ఒక్కో బాధ్యతను పంచుకుని సెంటర్‌ను నడిపించారు. గతంలో సెంటర్ల నిర్వహణలో ఉన్న లోటుపాట్లపై ముందే అధికార యంత్రాంగం అవగాహన కల్పించింది. ధాన్యం కొనుగోళ్లలో ఆత్మకూర్‌ (ఎస్‌) మండలం తుమ్మలపెన్‌పహాడ్‌ సంఘబంధం –3 ముందంజలో ఉంది. ఈ సంఘం 28వేల క్వింటాళ్ల ధాన్యాన్ని రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement