
దరఖాస్తుల ఆహ్వానం
భానుపురి (సూర్యాపేట) : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలు – 2025 కోసం హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో గిరిజన ఐఏఎస్ స్టడీ సర్కిల్ ద్వారా రెసిడెన్షియల్ పద్ధతిలో శిక్షణ ఇచ్చేందుకు ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థులనుంచి ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కె.శంకర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 14వ తేదీ నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకోసం 6281766534 నంబర్ను అన్ని పనిదినాల్లో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల లోపు సంప్రదించాలని కోరారు.
అక్రమ రవాణాను నిరోధించాలి
సూర్యాపేటటౌన్ : అక్రమ రవాణాను నిరోధించాలని జిల్లా ఎస్పీ కె.నరసింహ సూచించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద, జాతీయ రహదారి వెంబడి మంగళవారం రాత్రి స్థానిక పోలీసులతో కలిసి పౌరుల, ప్రయాణికుల భద్రత, రక్షణను ఎస్పీ పరిశీలించి మాట్లాడారు. ప్రజలకు పూర్తి స్థాయి భద్రత కల్పించడానికి, భరోసా కల్పించడానికి నిత్యం తనిఖీలు చేయాలన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సూర్యాపేట పట్టణం ముఖ్య రవాణా కేంద్రంగా ఉందని ఇక్కడ పోలీసు శాఖ అనునిత్యం అప్రమత్తంగా ఉందన్నారు. అక్రమ రవాణా జరగకుండా నిఘా ఏర్పాటు చేయాలన్నారు.అనుమానిత వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రణాళికతో పని చేయాలన్నారు. బారికేడ్లు, డివైడర్లు ఏర్పాటు చేసుకోవాలని, రోడ్ల ను ఆక్రమించి వ్యాపారాలు చేసేవారిని సర్దుబాటు చేయాలని ట్రాఫిక్ పోలీసులకు ఎస్పీ సూచించారు.
పెన్షనర్ల ఆర్థిక
ప్రయోజనాలకు ఎసరు
భానుపురి (సూర్యాపేట) : పెన్షనర్ల ఆర్థిక ప్రయోజనాలకు ఎసరు పెట్టేలా కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటులో చట్టం ఆమోదించిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సుదర్శన్రెడ్డి ఆరోపించారు. కేంద్రం ఆమోదించిన చట్టానికి వ్యతిరేకంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్రం ఆమోదించిన బిల్లుతో పెన్షనర్లకు పీఆర్సీ, తదితర ఆర్థిక ప్రయోజనాల్లో ఆటంకాలు కలుగుతాయన్నారు. ఆల్ ఇండియా పెన్షనర్ల ఫెడరేషన్ పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లు రాంబాబు, కోశాధికారి ఎం.ఏ. హమీద్ఖాన్, సూర్యాపేట మండల అధ్యక్ష, కార్యదర్శులు డి.శ్యాంసుందర్రెడ్డి, ఎస్.నాగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.