
పట్టు చికే్కదెవరికో..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీని బలపరుస్తారు.. ఎవరు పట్టు సాధిస్తారన్న చర్చ జరుగుతోంది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉండగా అత్యధిక స్థానాలు ఆ పార్టీ కై వసం చేసుకుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పట్టు సాధిస్తుందా? బీఆర్ఎస్ గతంలో సాధించిన స్థానాలను నెలబెట్టుకుంటుందా? అన్న చర్చ జోరుగా సాగుతోంది.
గత ఎన్నికల్లో బీఆర్ఎస్దే పైచేయి
2019లో స్థానిక సంస్థల ఎన్నికల్లో సూర్యాపేట జిల్లాలో 235 ఎంపీటీసీ స్థానాల్లో బీఆర్ఎస్ 141, కాంగ్రెస్ 74, బీజేపీ 3, సీపీఐ 2, సీపీఎం 2, టీడీపీ 3, స్వతంత్రులు 10 స్థానాల్లో గెలుపొందారు. 23 ఎంపీపీలకు గాను బీఆర్ఎస్ 19, కాంగ్రెస్ 4 ఎంపీపీ పీఠాలు దక్కించుకున్నాయి. 23 జెడ్పీటీసీ స్థానాలకు గాను బీఆర్ఎస్ 20 స్థానాల్లో గెలుపొంది జెడ్పీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోగా, కాంగ్రెస్ 3 జెడ్పీటీసీ స్థానాలకే పరిమితమైంది.
మారిన బలాబలాలు..
ఉమ్మడి జిల్లాలోని 12 ఎమ్మెల్యే స్థానాల్లో 2018 ఎన్నికల్లో 9 సీట్లను బీఆర్ఎస్, మూడు సీట్లను కాంగ్రెస్ గెలుచుకున్నాయి. నకిరేకల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన చిరుమర్తి లింగయ్య ఆ తరువాత బీఆర్ఎస్లో చేరారు. హుజూర్నగర్ నుంచి గెలుపొందిన ఉత్తమ్కుమార్రెడ్డి నల్లగొండ ఎంపీగా గెలుపొందటంతో ఎమ్మెల్యే పదవి రాజీనామా చేశారు. దీంతో అక్కడ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి గెలుపొందారు. దీంతో 2019లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో బీఆర్ఎస్కు 11 మంది ఎమ్మెల్యేలు ఉండగా, కాంగ్రెస్కు మునుగోడు నుంచి ఒకే ఒక్క ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి (తరువాత బీజేపీలో చేరారు. మళ్లీ కాంగ్రెస్లోకి వచ్చారు) ఉన్నారు. కాంగ్రెస్కు ఇద్దరు ఎంపీలు కూడా ఉన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉండడంతో ఎమ్మెల్యేల ప్రభావంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక స్థానాలను గెలుపొందింది. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నుంచి 11 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్ని స్థానాలను కై వసం చేసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీ తాము చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అధిక మొత్తంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను కై వసం చేసుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. అలాగే.. బీఆర్ఎస్ పార్టీ తమ పాత స్థానాలను కాపాడుకునే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. బీజేపీ కూడా ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది.
ఫ గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను దక్కించుకున్న బీఆర్ఎస్
ఫ ఈసారి పైచేయి
సాధించేందుకు కాంగ్రెస్ ప్రణాళిక
ఫ పల్లెల్లో జోరందుకున్న
రాజకీయ చర్చలు