
రైతు భరోసా వచ్చె..
దరఖాస్తులు స్వీకరిస్తున్నాం
రెండెకరాల వరకు భూమి ఉన్న రైతుల అకౌంట్లలో రైతు భరోసా డబ్బులు జమ య్యాయి. కొత్తగా పట్టాలు పొందిన రైతులకూ పెట్టుబడిసాయం ఇవ్వాలని నిర్ణయించారు. వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నాం.
– జి.శ్రీధర్రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి
భానుపురి (సూర్యాపేట) : వానాకాలం వ్యవసాయ పనులను రైతులు ముమ్మరం చేశారు. విత్తనాలు విత్తుకోవడం మొదలుపెట్టారు. ఈ సమయంలో సాగు ఖర్చులకోసం అన్నదాతలకు బాసటగా నిలిచేందుకు ప్రభుత్వం రైతుభరోసా డబ్బులు విడుదల చేసింది. సోమవారం జిల్లాలో రెండెకరాల వరకు భూమి ఉన్న 1,11,752 మంది రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేసింది. అలాగే ఈనెల 5 లోపు కొత్తగా భూములకు పట్టాలు పొందిన రైతులకు సైతం రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించి వారినుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈనెల 18వరకు దరఖాస్తుకు గడువు ఉంది. ఇది పూర్తయ్యాక వీరికి కూడా రైతు భరోసా అందనుంది.
గత యాసంగిలో 2,44,423 మందికి
సూర్యాపేట జిల్లాలో 2,70,853 మంది రైతులకు కలిపి 6.19లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అనర్హులకు రైతు భరోసా అందుతుందని భావించి విచారణ చేపట్టింది. అనర్హులను తొలగించి జిల్లాలో 2,44,423 మంది రైతులకు గత యాసంగిలో రూ.227.44 కోట్లు జమ చేసింది. సూర్యాపేట జిల్లాలో కొత్తగా పట్టాలు పొందిన 5,043 మంది రైతుల వివరాలను సీసీఎల్ఏ అధికారులు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు జాబితాను పంపారు.
బ్యాంకు వివరాలు ఇవ్వని వారిపైన దృష్టి..
గత యాసంగిలో ప్రభుత్వం అందించిన రైతు భరోసా నిధులు చాలామంది రైతులకు అందలేదు. చాలామంది పట్టాలు పొంది ఉన్నప్పటికీ బ్యాంకు వివరాలను అధికారులకు ఇవ్వడంలో పొరపాట్లు చేస్తున్నారు. కొందరు బ్యాంకు వివరాలు ఇచ్చినా ఆధార్ వివరాలతో సరిపోలేకపోవడంతో తప్పుగా నమోదవుతున్నాయి. ఇలా చాలామందికి రైతు భరోసా అందడం లేదు. ఇలాంటి సమస్యలను పరిష్కరించేందుకు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం వ్యవసాయ అధికారులకు సూచించింది. అధికారులు సైతం ఈ దిశగా చర్యలకు ఉపక్రమించగా దాదాపు 900 మంది వరకు ఉన్నట్లు తెలిసింది. కొత్తగా పట్టాలు పొందిన రైతులు రైతు భరోసా సాయం కోసం సంబంధిత మండలాల్లోని ఏఈఓలకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా జిరాక్స్ ప్రతులతో ఈనెల 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు.
ఫ రెండెకరాల వరకు భూమి ఉన్న 1,11,752 మంది రైతుల ఖాతాల్లో సోమవారం డబ్బులు జమ
ఫ విడతల వారీగా మిగతా రైతులకు..
ఫ కొత్తగా పట్టాలు పొందిన వారి నుంచి దరఖాస్తుల స్వీకరణ

రైతు భరోసా వచ్చె..