
సామర్థ్యానికి మించి వాహనాల్లోకి ఎక్కించొద్దు
సూర్యాపేటటౌన్ : సామర్థ్యానికి మించి వాహనాల్లోకి విద్యార్థులను ఎక్కించొద్దని ఎస్పీ నరసింహ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలలు ప్రారంభమయ్యాయని, విద్యార్థులను రవాణా చేసే వాహనాలు కండిషన్లో ఉండాలని, వాటి నిర్వహణలో నియమ నిబంధనలు పాటించాలని, స్థితిగతులను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలని సూచించారు. బస్సులు, వ్యాన్లు, ఆటోలు, ఇతర వాహనాలు నడిపే డ్రైవర్లు మంచి నైపుణ్యం కలిగి ఉండాలని తెలిపారు. వాహనాల్లో మ్యూజిక్ పరికరాలు ఉపయోగించవద్దని పేర్కొన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడపవద్దని, రోడ్డు క్రాసింగ్ల వద్ద అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
గిరిజనుల అభివృద్ధికి
కేంద్ర ప్రభుత్వం కృషి
అనంతగిరి: గిరిజనుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషి మరువలేనిదని మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ అన్నారు. శనివారం అనంతగిరి మండలంలోని కొత్తగోల్తండా గ్రామంలో రాష్ట్ర గిరిజన మోర్చా అధికార ప్రతినిధి, కోదాడ నియోజకవర్గ గిరిజన మోర్చా అసెంబ్లీ నియోజవర్గ కన్వీనర్ బాణోతు అనుషా నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వికసిత్ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. గిరిజనులకు సమ్మక్క సారక్క యూనివర్సిటీతో పాటు అనేక జాతీయ విప్లవాత్మకమైన మార్పులు ఆర్టికల్ 370 రద్దు, ఆపరేషన్ సింధూర్ వంటివి చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి, రాష్ట్ర నాయకురాలు కవితా రెడ్డి, గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు ధరావత్ సంతోష్ నాయక్, అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ కనగాల నారాయణ, బీజేపీ మండల అధ్యక్షుడు చింతకుంట్ల సతీష్, బొలిశెట్టి కృష్ణయ్య, యశ్వంత్, కిట్టు పాల్గొన్నారు.
శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శనివారం శ్రీలక్ష్మీనరసింహ స్వామి నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం, ఎదుర్కోళ్ల మహోత్సవం జరిపించారు. అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మధుఫర్కపూజ, మాంగల్యధారణ పూర్తిగావించారు. అనంతరం గరుడవాహనంపై శ్రీస్వామివారిని ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్కుమార్, అర్చకులు పాల్గొన్నారు.

సామర్థ్యానికి మించి వాహనాల్లోకి ఎక్కించొద్దు