
ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలు పెంచాలి
ఆత్మకూర్(ఎస్)(సూర్యాపేట) : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లు పెంచాలని ఇంటర్ బోర్డు డిప్యూటీ సెక్రటరీ, సూర్యాపేట జిల్లా ప్రత్యేకాధికారి హేమచందర్ అన్నారు. శుక్రవారం నెమ్మికల్లు ప్రభుత్వ కళాశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గతేడాది కన్నా ఈ ఏడాది 30శాతం అడ్మిషన్లను పెంచే బాధ్యత అధ్యాపకులు తీసుకోవాలని సూచించారు. కళాశాల పరిసర ప్రాంతాల్లోని పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులను ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేర్పించాలన్నారు. సూర్యాపేట జిల్లాలో 8 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయని, వాటిల్లో ప్రవేశాల శాతం పెంచేందుకు స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేశామన్నారు. ప్రతి తరగతిలో 40 మంది విద్యార్థులు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఒక పాఠశాలకు ఒక ఇన్చార్జ్ చొప్పున ఏర్పాటు చేసి ఒక్కొక్కరు 20 అడ్మిషన్లు చేయాలని సూచించారు. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి భాను నాయక్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు ప్రతి కళాశాలను ఒకసారి సందర్శించి అధ్యాపకులకు సూచనలు చేశామన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ గుణగంటి వెంకటేశ్వర్లు, అధ్యాపకులు పాల్గొన్నారు.