
వంతెనకు మోక్షమెప్పుడో..
గరిడేపల్లి: గరిడేపల్లి నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారిలో మర్రికుంట వద్ద సాగర ప్రధాన ఎడమ కాల్వ పై ఉన్న వంతెన శిథిలావస్థకు చేరింది. దీని నిర్మాణానికి నిధులు మంజూరైనప్పటికీ పనుల ప్రారంభానికి మోక్షం లభించడం లేదు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. గతంలో చిన్న చిన్న మరమ్మతులు చేసి వదిలేశారు. గరిడేపల్లి నుండి సూర్యాపేట జిల్లా కేంద్రానికి ప్రతి రోజు వేల వాహనాలు వంతెన మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. వంతెన చిన్నదిగా ఉండడంతోపాటు, శిథిలావస్థకు చేరడంతో ఎప్పుడు కూలుతుందోనని ఆందోళన చెందుతున్నారు.
2023లో రూ. కోటి 93లక్షలు మంజూరు
వంతెన నిర్మాణానికి 2023లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి రూ. కోటి 93లక్షలు మంజూరయ్యాయి. అధికారులు టెండర్ కూడా పూర్తి చేశారు. వంతెన నిర్మాణానికి నూతన అలైన్మెంట్ ఏర్పాటు చేశారు. కొంతమంది గ్రామస్తులు తమ ఇళ్లు పోతాయని దీనికి అభ్యంతరం తెలపడంతో కాంట్రాక్టర్ పనులు ప్రారంభించేందుకు ముందుకు రాలేదు. దీంతో వంతెన నిర్మాణ పనులు కలగానే మిగిలాయి. 2023లో అగ్రిమెంట్ అయిందని ప్రస్తుతం అన్ని రకాల రేట్లు పెరిగాయని, తాను పనులు చేయలేనని, కొత్త ధరల ప్రకారం మాత్రమే పనులు చేసే అవకాశం ఉందని కాంట్రాక్టర్ అధికారులకు విన్నవించుకున్నాడు. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే గరిడేపల్లి, హుజూర్నగర్, మఠంపల్లి, నేరేడుచర్ల మండలాలోని ప్రజలకు సూర్యాపేట వెళ్లేందుకు ప్రయాణం సులువుగా ఉంటుంది.
పనులు నిలిచిపోయాయి
2023లో వంతెన నిర్మాణానికి రూ. కోటి 93లక్షలు మంజూరయ్యాయి. కాంట్రాక్టర్ అగ్రిమెంట్ కూడా పూర్తి చేసుకున్నాడు. కానీ నూతన అలైన్మెంట్ ప్రకారం గ్రామస్తులు వంతెన నిర్మాణానికి బ్రిడ్జి లొకేషన్ ఫిక్సింగ్ విషయంలో అంగీకరించకపోడంతో పనులు ప్రారంభం కాలేదు. ప్రస్తుతం కాంట్రాక్టర్ కూడా కొత్త ధరల ప్రకారమే నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి విన్నవించుకున్నాడు.
– రఘు, ఇరిగేషన్ డీఈ, హుజూర్నగర్
ఫ శిథిలావస్థకు చేరిన మర్రికుంట వంతెన
ఫ నిధులు మంజూరై రెండు సంవత్సరాలు
ఫ ఇప్పటివరకు ప్రారంభం కాని పనులు