
సర్కారు బడి బలోపేతానికి..
వేసవి సెలవులకు ముందే బడిబాట
ఫ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను
పెంచడమే లక్ష్యం
ఫ 23 వరకు కొనసాగనున్న కార్యక్రమం
ప్రభుత్వ పాఠశాలల్లోనే అన్ని వసతులు
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తోంది. ప్రస్తుతం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత కూడా లేదు. నాణ్యమైన బోధన అందుతోంది. కార్పొరేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన బోధన, డిజిటల్ తరగతులు, సౌకర్యాలు కల్పిస్తున్నాం. పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివి సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఆసక్తితో స్వచ్ఛందంగా వారే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
– అశోక్, డీఈఓ
సూర్యాపేటటౌన్ : సర్కారు బడి బలోపేతానికి కొందరు ఉపాధ్యాయులు నడుం బిగించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా వేసవి సెలవులకు ముందే వీరు స్వచ్ఛందంగా బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అధికారికంగా కాకపోయినప్పటికీ రెండు మూడు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ కార్యక్రమం ఈనెల 23 వరకు కొనసాగనుంది.
జిల్లాలో 950 ప్రభుత్వ పాఠశాలలు..
జిల్లాలో ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలు మెత్తం 950 ఉన్నాయి. వీటిలో 690 ప్రాథమిక, 70 ప్రాథమికోన్నత, 190 ప్రభుత్వ ఉన్నత, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో మొత్తం 70వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంపే లక్ష్యంగా బడిబాట కార్యక్రమాన్ని ఏటా జూన్లో నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఏడాది ముందస్తుగానే స్వచ్ఛందంగా ఉపాధ్యాయులు బడిబాట నిర్వహిస్తున్నారు.
ముందస్తుగానే విద్యార్థుల గుర్తింపు..
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన కొంత మంది ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కలిసి స్వచ్ఛందంగా ముందస్తుగా బడి బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఒంటి పూట బడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఉదయం 7 నుంచి ఉదయం 8 గంటల మధ్య నిర్వహిస్తున్నారు. మరి కొన్ని పాఠశాలల్లో మధ్యాహ్నం 12.30 గంటల తర్వాత నిర్వహిస్తున్నారు. గ్రామంలో బడిబయట ఉన్న పిల్లలు, ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, మోడల్ స్కూళ్లకు వెళ్లే విద్యార్థులను గుర్తించి స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సర్కారు కల్పిస్తున్న సౌకర్యాలు, డిజటల్ తరగతులు గురించి పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. గుర్తించిన పిల్లలను జూన్ మొదటి వారంలో లో నిర్వహించే అధికారిక బడిబాట కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో చేర్చుకోనున్నారు.
రెండు మూడు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా..
ప్రతి సారి జూన్లో బడిబాట నిర్వహిస్తుండటంతో అప్పటికే విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల్లో అడ్మిషన్లు పొందుతున్నారు. ఈ విషయాన్ని కొంత మంది ప్రధానోపాధ్యాయులు కలెక్టర్ తేజస్నంద్లాల్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ సారి జిల్లాలో ముందస్తుగానే బడిబాట నిర్వహించి పాఠశాలలు ముగిసే సమయానికి జిల్లా అంతా బడిబాట నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే జిల్లాలో మరో రెండు మూడు రోజుల్లో అన్ని పాఠశాలల్లో బడిబాట నిర్వహించాలని ఆదేశాలు రానున్నట్టు అధికారులు తెలుపుతున్నారు.

సర్కారు బడి బలోపేతానికి..