స్కూల్లో సోలార్
నాగారం: విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకునేందుకు సర్కారు పాఠశాలలకు సౌర విద్యుత్ సదుపాయం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి పాఠశాలలో రెండు కిలోవాట్స్ కరెంటు అందించే సౌర విద్యుత్ ఉత్పత్తి పరికరాలను అమరిస్తే, స్కూల్ అవసరాలకు పోగా మిగతా విద్యుత్ను గ్రిడ్కు అమ్ముకోవచ్చని భావిస్తోంది. ప్రభుత్వం సోలార్ ప్లాంట్ ఏర్పాటును తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీఎస్రెడ్కో)కు అప్పగించింది. జిల్లాలో ఇప్పటికే మొదటి విడతగా 45 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో సోలార్ పలకలను అమర్చారు.
నెలకు రూ.2వేల బిల్లు చెల్లించాల్సి వస్తోందని..
నిత్యం మధ్యాహ్న భోజనం, ఏడాదికో సారి రెండు జతల దుస్తులు, ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ వివరాలతో పాటు వివిధ రకాల సమాచారాన్ని నెలవారీగా ప్రధానోపాధ్యాయులు ఉన్నతాఽధికారులకు అందిస్తున్నారు. డిజిటల్ తరగతుల నిర్వహణతో కూడా విద్యుత్ వినియోగం పెరిగి నెలకు కనీసం రూ.2000 విద్యుత్ బిల్లు చెల్లించాల్సి వస్తోందని జెడ్పీ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. ఈ బిల్లులను ప్రభుత్వమే భరిస్తే లేదా రద్దు చేస్తే మిగిలిన సొమ్మును పాఠశాలల్లో భౌతిక వసతుల కల్పనకు వెచ్చిస్తామని చాలా కాలం నుంచి హెచ్ఎంలు ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు.
ఆర్థిక ప్రయోజనమిది..
జిల్లా వ్యాప్తంగా 175 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉండగా వీటిలో మొదటి విడత ఎంపిక చేసిన 45 పాఠశాలల్లో రెండు కిలోవాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసే సౌర పరికరాలను అమర్చారు. దీని ఏర్పాటుకు అయ్యే ఖర్చు రూ.లక్షను ప్రభుత్వం అందించింది. పాఠశాల అవసరాలకు రోజుకూ రెండు యూనిట్ల విద్యుత్ వాడుకున్నా మిగులు విద్యుత్ను గ్రిడ్కు అమ్ముకోవచ్చు. ఇది పాఠశాలలకు ఆర్థిక ప్రయోజనం. ఎలాంటి విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిన అవసరం ఉండదు.
ఫ 45 జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో సౌరవిద్యుత్ పలకల ఏర్పాటు
ఫ రెండు కిలోవాట్ల విద్యుదుత్పత్తి చేసే సౌర పలకల బిగింపు
ఫ తప్పనున్న కరెంటు బిల్లుల భారం
ఫ ప్రధానోపాధ్యాయులకు ఊరట
నెలకు రూ.2వేలు ఆదా అవుతుంది
పాఠశాలల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయడంతో విద్యుత్ బిల్లుల భారం తగ్గుతుంది. సోలార్ విద్యుత్తో ప్రతి పాఠశాలకు నెలకు రెండు వేల రూపాయల వరకు ఆదా అవుతాయి. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా మిగితా పాఠశాలల్లో సోలార్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తాం.
– అశోక్, డీఈఓ, సూర్యాపేట.