శ్రీకాకుళం క్రైమ్: ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు సకాలంలో పరిష్కారం చూపాలని పోలీసు అధికారులను ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్సుకు ప్రజల నుంచి 62 వినతులు అందాయి. ఎస్పీ స్వయంగా ఫిర్యాదులు స్వీకరించి బాధితులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.
వినతులు పరిశీలిస్తే...
● పోలాకి మండలానికి చెందిన ఒక యువకుడు తనను ప్రేమించి గర్భవతిని చేశాడని, తీరా వివాహం చేసుకోమనగా పట్టించుకోవడం లేదని ఒక దళిత యువతి ఎస్పీకి ఫిర్యాదు చేసింది. గత నెల 6వ తేదీన నరసన్నపేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదని వాపోయింది.
● ఈనెల 9వ తేదీన వప్పంగిలో తమ కుటుంబ సభ్యులపై కొందరు దాడికి పాల్పడగా గాయాలతో రిమ్స్కు చేరామని, అక్కడ ఎంఎల్సీ నమోదైందని అయినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయలేదని గీత కార్మికుడు లక్ష్మణరావు ఫిర్యాదు చేశారు.


