● నిధులు సుడావి..
ప్రారంభోత్సవాలు టీడీపీ నేతలవి
● జిల్లా కేంద్రంలో కార్గిల్ పార్క్, రామలక్ష్మణ నుంచి పెద్దపాడు రోడ్డు పనులు ప్రారంభం
● కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రారంభించిన వైనం
● సుడా చైర్మన్ లేని సమయంలో ప్రారంభంపై మండిపడుతున్న జనసేన శ్రేణులు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
జనసేనను తెలుగు తమ్ముళ్లు పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు. అధికారిక కార్యక్రమాల్లో వారికంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు. పొత్తు ధర్మం అన్నది పాటించడమే లేదు. ఎన్నికల వరకే వారి అవసరం, ఆ తర్వాత అనవసరం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.
పనులు చేయడం, కమీషన్లు కొట్టేయడం, పూర్తయిన పనులు ప్రారంభించడం అంతా తెలుగుదేశం పార్టీ నేతలే చేస్తున్నారని జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు. జిల్లా కేంద్రంలో గత కొన్ని నెలలు గా కార్గిల్ పార్కు నిర్మాణం చేస్తున్నారు. ఈ పార్క్ నిర్మాణానికి సుడా నిధులు రూ.2కోట్లు వరకు వెచ్చించారు. కానీ పనులు పూర్తి కాకుండానే హడావుడిగా ప్రారంభించేశారు. దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో తెలియడం లేదని జనసైనికులు మండిపడుతున్నారు. అంతేకాకుండా రామలక్ష్మణ కూడలి నుంచి పెద్దపాడు వరకు రోడ్డు నిర్మాణం, డివైడర్ పనులు, సెంట్రల్ లైటింగ్ తదితర పనులను మొత్తం రూ.3.68కోట్లతో చేశారు. ఇందులో ఏ పనులూ పూర్తికాకుండానే ప్రారంభించేశారు. సుడా చైర్మన్ కొరికాన రవికుమార్, సుడా వైస్ చైర్మన్ లేని సమయంలో ప్రారంభించడం ఏంటని జనసేన నాయకులు మండిపడుతున్నారు. వీరిద్దరికి ఎలాంటి సమాచారం లేకుండా కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్లు 21వ తేదీ రంజాన్ నాడు రాత్రికి రాత్రి పనులు ప్రారంభించేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. పోనీ పనులు పూర్తయ్యి అంతా సిద్ధంగా ఉన్నాక ప్రారంభించారా అంటే అదీ లేదు. తెలుగుదేశం పార్టీ నేతలే పెత్తనం చెలాయిస్తున్నారు తప్ప కూటమిలో జనసేన నాయకులకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. సుడా సొమ్ముతో పనులు చేసినప్పుడు కనీసం ఆ శాఖ చైర్మన్కి ప్రాధాన్యత ఇవ్వాలి, కనీసం వైస్ చైర్మన్గా జాయింట్ కలెక్టర్ ఉన్నారు. ఆయన కూడా లేని సమయంలో ప్రారంభించేశారు.


