
ఈదుపురంలో ఇరువర్గాల కొట్లాట
ఇచ్ఛాపురం రూరల్: ఈదుపురం గ్రామంలో మంగళవారం ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణ కొట్లాటకు దారితీసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్దిలి జగన్నాథం, అంబటి శంకర్కు చెందిన అనుచరుల మధ్య మూడు రోజుల క్రితం పిక్కాట వద్ద ఘర్షణ చెలరేగింది. గ్రామపెద్దలు కలగజేసుకొని సోమవారం గ్రామంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇరువర్గాలను శాంతింపజేశారు. మంగళవారం వేణుగోపాల కాలనీ వద్ద మరోసారి ఇరువర్గాలు ఘర్షణ ఏర్పడటంతో కొట్లాటకు దారితీసింది. కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో దాసరి పుణ్యావతి, మద్దిలి జగన్నాథం, అంబటి శంకర్, అంబటి కుమార్, మురళీ, దువ్వు ఎల్లయ్య, దువ్వు ప్రశాంత్, బోర యువరాజులు తీవ్ర గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న ఎస్ఐ ఈ.శ్రీనివాస్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. గాయపడిన వారిని ఇచ్ఛాపురం సామాజిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందజేశారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.