
నేలకు రక్ష
మట్టి పరీక్ష..
● భూసార పరీక్షలతో బహుళ ప్రయోజనాలు ● ఫలితాల ఆధారంగా సాగు చేస్తే అధిక దిగుబడులు
కవిటి: అధిక దిగుబడులు సాధించాలనే క్రమంలో కొందరు రైతులు పరిమితికి మించి రసాయన ఎరువులు వినియోగిస్తున్నారు. ముఖ్యంగా పంటకు అవసరం లేకపోయినా ఎరువులు, పురుగుమందులు విచ్చలవిడిగా వాడుతున్నారు. దీంతో దిగుబడులు రాకపోగా.. భూమి సారవంతం కోల్పోతోంది. ఈ సమస్యను అధిగమించాలంటే భూసార పరీక్షలు ఒక్కటే మార్గమని వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన పంటలు పండాలంటే నేలలో ఖనిజ లవణాలు, పోషకాలు సమృద్ధిగా ఉండాలి. దీనిపై దృష్టి పెట్టకుండా అధిక దిగుబడులు సాధించాలనే ఆశతో కొందరు రైతన్నలు రసాయనిక ఎరువులు భారీగా వినియోగిస్తున్నారు. దీంతో భూమి సమతుల్యత కోల్పోతోంది. మొక్కకు సరైన పోషకాలు అందక పంట దిగుబడులపై పెను ప్రభావం పడుతోంది. మట్టి నమూనా పరీక్షలు చేయించి ,ఆ ఫలితాలకు అనుగుణంగా పంట సాగు చేస్తే మేలైన దిగుబడులతో సాగుఖర్చులు తగ్గే అవకాశముంటుంది.
భూసార పరీక్షలు కీలకం..
భూమిలో ప్రధాన పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాషియం పరిమాణాల్లో మార్పులను భూసార పరీక్షల ద్వారా గుర్తించవచ్చు. సూక్ష్మ పోషకాల లోపాలను తెలుసుకోవడమే కాకుండా భూమిలో ఏ పోషకాలు తగ్గాయి అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. సేంద్రియ కర్బనం తగ్గితే పచ్చిరొట్ట పంటలను సాగు చేసి నష్టాలను నివారించవచ్చు. నేల పోషణ సామర్ాధ్యన్ని తెలుసుకోవడం ద్వారా ఏ పంట వేస్తే మంచి దిగుబడి వస్తుందో రైతులు గ్రహించే అవకాశం ఉంటుంది.
మోతాదు మించితే..
పంటల సాగులో అధిక దిగుబడులు సాధించాలని తపనతో మోతాదుకు మించి వాడుతున్న రసాయనిక ఎరువుల వల్ల భూమిలో పోషకాలు నశించిపోతున్నాయి. పొటాషియం ఎక్కువగా వాడటం వల్ల మెగ్నీషియం, జింక్, ఇనుము వంటి పోషకాలు మొక్కలకు అందకుండాపోతున్నాయి. జింక్ లోపం కారణంగా మొక్క ఎదుగుదల తగ్గి దిగుబడులపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. సూక్ష్మ పోషకాలతో పాటు నైట్రోజన్, సేంద్రియ కర్బనాల స్థాయి చాలా కీలకం. సేంద్రియ కర్బనం లోపిస్తే భూమి సహజ స్వభావాన్ని కోల్పోతుంది. దీంతో ఆ భూమిలో ఎంత ఎరువు వేసినా భూమి గ్రహించకుండా నిస్సారమవుతుంది.
ప్రయోగశాలలో..
భూమిలో సేంద్రియ కర్బనం 0.5 నుంచి 0.7 శాతం వరకు ఉంటే సాధారణంగా పరిగణిస్తారు. మట్టిని ప్రయోగశాలలో విశ్లేషించి ఆ నేల స్వభావం లక్షణాలు పోషక విలువలు స్థాయిలను గుర్తిస్తారు. ఈ ఫలితాల ఆధారంగా ఏ పంటకు ఎంత మోతాదులో పోషకాలు అవసరమో తెలుస్తుంది. ప్రతి మూడేళ్లకోసారి భూసార పరీక్షలు చేయించడం మంచిదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
ప్రోత్సహిస్తున్నాం
కవిటి మండలంలో ఈ ఏడాది ఇప్పటి వరకు 745 క్వింటాళ్ల వరి విత్తనాలు సరఫరా చేశాం. ఇప్పటి వరకు 1237 మంది రైతుల నుంచి భూసార పరీక్షలకు కోసం శాంపిల్స్ తీసుకున్నాం. ఫలితాలు త్వరలో రానున్నాయి. సేంద్రియ కర్బనం, సూక్ష్మ పోషకాల పెంపుదలే లక్ష్యంగా పచ్చిరొట్ట వాడకంపై విస్తృత ప్రచారం కల్పించి జీలుగ ఎరువు వాడకం పెంచాం. రసాయనిక ఎరువుల వాడకంపై రైతులకు ఎప్పటికప్పుడు మా సాంకేతిక సలహాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం.
– పి.శ్రీదేవి, మండల వ్యవసాయాధికారి, కవిటి
మూడేళ్లకోసారి పరీక్ష
వ్యవసాయశాఖ అధికారుల తోడ్పాటుతో ఏటా ఆధునిక వ్యవసాయ విధానాలపై దృష్టిసారించా. కొత్తరకం వరివంగడాలు సాగుకు ఆసక్తిచూపుతున్నాను. ప్రధానంగా పశువుల గెత్తం వేయడం, పచ్చిరొట్ట పైర్ల సాగు, జింక్ తదితర సూక్ష్మపోషకాల సాగు అన్నిటినీ భూసారపరీక్ష ఫలితాలకు లోబడే వినియోగిస్తున్నాను.
– ఉప్పాడ వాసుదేవరెడ్డి, రైతు, పాతకొజ్జీరియా, కవిటి మండలం
ప్రయోజనాలివే..
మట్టి పరీక్షల్లో ఆమ్ల క్షార లవణాల స్థాయి, సేంద్రియ కర్బనం, భాస్వరం, పొటాషియం ఎంత నిష్పత్తిలో ఉన్నాయో తెలుసుకోవచ్చు.
పంట వయసు కాలాన్ని అనుసరించి ఎరువులను సమపాళ్లలో అందించవచ్చు.
ఆమ్లగుణం ఉన్న నేలల్లో సున్నం, క్షార గుణం ఉన్న నేలల్లో జిప్సంతో నేలను బాగు చేసుకోవచ్చు.
నేలలో సహజంగా ఉన్న పోషకాల స్థాయిని తెలుసుకొని సాగు చేసే పంటలకు ఎరువుల మోతాదు నిర్ణయించవచ్చు.
నేల పోషక సామర్థ్యాన్ని తెలుసుకొని దిగుబడులు పెంచుకునే అవకాశం ఉంది.

నేలకు రక్ష

నేలకు రక్ష

నేలకు రక్ష