
చోరీ కేసులో వ్యక్తి అరెస్టు
నరసన్నపేట: మండల కేంద్రం నరసన్నపేటలోని తెలగవీధిలో గొరిజల్లి శేఖర్ ఇంట్లో ఇటీవల జరిగిన చోరీ కేసుకు సంబంధించి సుందరాపురం గ్రామానికి చెందిన ఎం.వెంకటరమణను అరెస్టు చేశామని ఎస్ఐ దుర్గాప్రసాద్ తెలిపారు. నిందితుడు బాలసీమ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా పట్టుకొని విచారించగా దొంగతనం చేసినట్లు అంగీకరించడంతో అరెస్టు చేశామన్నారు. చోరీ సొత్తు తులం చైన్, చెవి దుద్దులు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
ప్రత్యేక శ్రద్ధతో బోధిస్తేనే సత్ఫలితాలు
జలుమూరు: విద్యార్థులకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధతో బోధన చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని డీఈఓ ఎస్.తిరుమల చైతన్య అన్నారు. మంగళవారం చల్లవానిపేట ఉన్నత, జలుమూరు ప్రాథమిక పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండేళ్ల క్రితం తొమ్మిది మందికే పరిమితమైన విద్యార్థుల సంఖ్య నేడు 86 మందికి చేరుకోవడంలో విశేష కృషి చేశారని జలుమూరు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు మెండ రామారావును ప్రత్యేకంగా అభినందించారు. రామారావు మాస్టారు ఓ క్రియేటర్ అని కితాబునిచ్చారు. పాఠశాలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కలెక్టర్కు నివేదించనున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మాధవరావు తదితరులు పాల్గొన్నారు.
కొర్లాంలో పూరిల్లు దగ్ధం
గార : కొర్లాం గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో కొర్లాపు అప్పన్నకు చెందిన పూరిల్లు దగ్ధమైంది. మంగళవారం ఉదయం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదానికి కారణం తెలియడం లేదు. ఇటీవలే మేకలు అమ్మగా వచ్చిన సుమారు రూ.లక్ష నగదు కాలి బూడిదయ్యాయి. ఆధార్, రేషన్కార్డు, దుస్తులు, తిండిగింజలు అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికులు మంటలార్పే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. వీఆర్వో సన్యాసిరావు పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేయగా, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.
నిధులు విడుదల చేయాలని వినతి
శ్రీకాకుళం పాతబస్టాండ్: కళాశాల విద్యార్థులకు సంబంధించి 2024–2025 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ, ఇతర కోర్సుల పోస్టుమెట్రిక్ స్కాలర్షిప్లు, విద్యా దీవెన, వసతి దీవెన నిధులు కళాశాలలకు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ డిగ్రీ కళాశాలల మేనేజ్మెంటు అసోసియేషన్ అధ్యక్షుడు పొన్నాన జయరాం కోరారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ను ఆయన చాంబర్లో కలిసి వినతిపత్రం అందజేశారు. స్కాలర్షిప్ నిధులలో 25 నుంచి 30 శాతం మాత్రమే ప్రిన్సిపాల్ ఖాతాలకు జమయ్యాయని తెలిపారు. నిధులు విడుదల కాక సిబ్బంది జీతాలు, అద్దె, విద్యుత్ బిల్లులు వంటి ప్రాథమిక ఆర్థిక బాధ్యతలను తీర్చలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యుత్ షాక్తో భవన నిర్మాణ కార్మికుడి మృతి
నందిగాం: దేవళభద్ర పంచాయతీ జల్లపల్లిలో విద్యుత్ షాక్కు గురై భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రమైన నందిగాంకు చెందిన కొర్లాపు శంకరరావు(42) మంగళవారం తోటి భవన నిర్మాణ కార్మికుడు అగురు బాలకృష్ణ, దేవళభద్రకు చెందిన మేసీ్త్ర ప్రసాద్ కలిసి జల్లపల్లిలో గొనప కారయ్య ఇంటి సెంటరింగ్ పనికి వెళ్లాడు. ఇనుప గజాలను తీస్తుండగా ఇంటికి ముందు ఉన్న 11 కేవీ హైటెన్షన్ వైరు తగలడంతో షాక్కు గురై కుప్పకూలిపోయాడు. వెంటనే తోటి కార్మికులు సపర్యలు చేసినా ఫలితం లేకపోయింది. శంకరరావుకు భార్య గౌరి, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య గౌరి ఇచ్చిన పిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ జి.వి.రమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చోరీ కేసులో వ్యక్తి అరెస్టు

చోరీ కేసులో వ్యక్తి అరెస్టు

చోరీ కేసులో వ్యక్తి అరెస్టు