
మస్తర్లలో మాయాజాలం!
సంతబొమ్మాళి: ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించి సంతబొమ్మాళి మండలం దండుగోపాలపురంలో పలు అవకతవకలు జరిగినట్లు వేతనదారులు చెబుతున్నారు. మస్తర్లలో మాయాజాలం నడిపించి పనికిరాకపోయిన వారికి సైతం హాజరు నమోదు చేసి వేల రూపాయలు కాజేశారని ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. దండుగోపాలపురంలో 15 ఏళ్లుగా ఫీల్డ్ అసిస్టెంట్గా పని చేసిన వరదరాజులను రాజకీయ కక్షతో తొలగించి అధికార పార్టీ నేతలు తమకు అనుకూలమైన వడ్డితాండ్ర నారాయణ అనే వ్యక్తితో నిబంధనలకు విరుద్ధంగా ఉపాధి పనులను చేయించారు. పనికి రాకపోయినప్పటికీ సుమారు 30 మంది పేర్లను మస్టర్లలో నమోదు చేసి ఒక్కొక్కరి అకౌంట్లో వేల రూపాయలను జమ చేయించి దోచుకున్నారు. బెండి సూర్యనారాయణ (జాబ్ కార్డు నెంబర్ 10446) ఒక్క రోజు కూడా ఉపాధి పని చేయకుండా తొమ్మిది వారాలు ఉపాధి పని చేసినట్లు మస్టర్లలో నమోదు చేశారు. అతని అకౌంట్లో రూ.13వేలు జమ అయ్యాయి. ఇదే తరహాలో బెండి విష్ణుమూర్తి, బాలక కృష్ణారావు, బాలక చంద్రశేఖరరావు, ఆరంగి జగన్నాధరావు, పొందర ప్రసాదరావు, పొందర మధు, కుమ్మరి రామారావు తదితర అకౌంట్లలో నిధులు జమయ్యాయి. ఉపాధి పని చేయిస్తున్న వడ్డితాండ్ర నారాయణ, అతని భార్య హేమలతకు నిబంధనలకు విరుద్ధంగా వేరువేరు జాబ్ కార్డులు ఉన్నాయి. నారాయణ(జాబ్కార్డు–10415)కు రూ.15.900, అతని భార్య హేమలత(జాబ్కార్డు–10686) ఉపాధి పనికి వెళ్లకపోయినా రూ.6.349 అకౌంట్లో నమోదయ్యాయి. ఇలా 30 మంది వరకు ఉపాధి పనికి వెళ్లకుండా మస్తర్లలో నమోదు చేశారని, దీనిపై దర్యాప్తు చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని వేతనదారులు కోరుతున్నారు. ఈ విషయమై ఉపాధి ఏపీవో నరసింహమూర్తి వద్ద ప్రస్తావించగా.. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అక్కడ ఎవరినీ ఫీల్డ్ అసిస్టెంట్గా నియమించలేదని తెలిపారు.
పనికి రాకుండానే హాజరు నమోదు భార్యాభర్తలకు వేర్వేరు జాబ్కార్డులు
దండుగోపాలపురం ఉపాధి పనుల్లో అక్రమాలు జరిగాయంటున్న వేతనదారులు