
వివాహిత అనుమానాస్పద మృతి
సోంపేట/మందస: మందస మండలంలోని కొత్తపేట గ్రామ సముద్ర తీరంలో సోంపేట మండలంలోని పాలవలస గ్రామానికి చెందిన గోకర్ల రాజేశ్వరి అనుమానాస్పద రీతిలో శవమై కనిపించింది. మందస పోలీసులు, రాజేశ్వరి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. పాలవలస గ్రామానికి చెందిన రాజేశ్వరి ఈనెల 11వ తేదీన పాలవలస నుంచి కన్నవారి గ్రామం పిడిమందస వెళ్లింది. ఐదు నెలల పాపను పాలవలసలో విడిచిపెట్టి ఉండడంతో రాజేశ్వరి బంధువులు పిడిమందస నుంచి హరిపురం వరకు ద్విచక్ర వాహనంలో తీసుకొచ్చి, మరలా పాలవలస చేరుకోవడానికి హరిపురంలో రాజేశ్వరిని బస్సు ఎక్కించారు. అయితే రాత్రి అవుతున్నా రాజేశ్వరి పాలవలస చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు పిడిమందస ఫోన్చేసి సమాచారం కనుక్కున్నారు. రాజేశ్వరి ఇంటికి చేరుకోలేదనే విషయం తెలియడంతో ఇరు కుటుంబాల సభ్యులు ఆందోళన చెందారు. హరిపురం నుంచి పాలవలస మధ్య గ్రామాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో మందస పోలీసుస్టేషన్లో వివాహిత అదృశ్యమైనట్లు కేసు నమోదు చేశారు.
ఇదీ విషయం...
మందస మండలంలోని కొత్తపేట గ్రామ సముద్ర తీరంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం ఆదివారం రాత్రి స్థానికుల కంటబడింది. సగం కాలిన స్థితిలో మృతదేహం ఉండడంతో స్థానికులు ఆందోళనతో మందస పోలీసులకు సమాచారం అందించారు. మందస పోలీసుస్టేషన్ పరిధిలో అప్పటికే మహిళ మిస్సింగ్ కేసు నమోదై ఉండడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. అయతే మహిళ మృతదేహం పాలవలస గ్రామానికి చెందిన రాజేశ్వరిదిగా సోమవారం ఉదయం నిర్ధారించారు. పిడిమందస గ్రామానికి చెందిన రాజేశ్వరికి పాలవలస గ్రామానికి చెందిన గోకర్ల చంద్రశేఖర్తో ఐదు సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. చంద్రశేఖర్ ఉపాధి నిమిత్తం విదేశాల్లో విధులు నిర్వహిస్తున్నాడు. వీరికి మూడు సంవత్సరాలు, ఐదు నెలలు వయసు గల ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే రాజేశ్వరి మృతికి గల కారణాలు తెలియడం లేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరో హత్యచేసి ఉంటారని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. రాజేశ్వరి మృతి చెందిందని తెలియడంతో పాలవలస, పిడిమందస గ్రామాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. సంఘటన స్థలాన్ని కాశీబుగ్గ డీఎస్పీ వెంకట అప్పారావు, సోంపేట సీఐ బి.మంగరాజు, కాశీబుగ్గ రూరల్ సీఐ తిరుపతిరావు, మందస ఎస్ఐ కె.కృష్ణ, శ్రీకాకుళం క్లూస్ టీమ్ సభ్యులు పరిశీలించారు.
పాలవలసలో ఏం జరుగుతోంది..
సోంపేట మండలంలోని పాలవలస గ్రామంలో అలజడి నెలకొంది. గ్రామంలో వరుస హత్యలు జరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత నెల 18వ తేదీన అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్న సమయంలో గ్రామానికి చెందిన గోకర్ల ఈశ్వరరావును గుర్తు తెలియని వ్యక్తులు సమీప జీడితోటల్లో హత్య చేశారు. కాగా ఇప్పటికీ హత్యకు గల కారణాలు, దోషులు తెలియలేదు. ఈ ఘటన మరువకముందే ఈశ్వరరావు ఇంటికి ఎదురుగా ఉన్న గోకర్ల రాజేశ్వరి(25) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వార్త గ్రామంలో కలకలం సృష్టించింది.
పాలవలసలో కలవరపెడుతున్న వరుస హత్యలు..?

వివాహిత అనుమానాస్పద మృతి

వివాహిత అనుమానాస్పద మృతి