యోగాంధ్రకు ముమ్మర సన్నాహాలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే యోగాంధ్ర–2025 కార్యక్రమం రాష్ట్రానికి గొప్ప గౌరవమని, ఎలాంటి లోపం లేకుండా దీన్ని విజయవంతం చేయాలని, ప్రతి శాఖ సమన్వయంతో, సమగ్ర పర్యవేక్షణతో ముందుకు సాగాలని జిల్లా ఇన్చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస రావు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధ్యక్షతన సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని వివి ధ శాఖల అధికారులు, ఎమ్మెల్యేలు, యోగాంధ్ర ఇన్చార్జిలు సమావేశంలో పాల్గొన్నారు.
ప్రపంచ రికార్డు లక్ష్యం...
గిన్నిస్ బుక్లో స్థానం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని మంత్రులు తెలిపారు. జిల్లా నుంచి విశాఖకు వెళ్లే ప్రణాళికలను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. జిల్లా నుంచే 20 వేల మంది విశాఖ కార్యక్రమానికి వెళతారని కలెక్టర్ తెలిపారు. 150 ఆర్టీసీ, 400 ప్రైవేట్ బస్సులు ఇందుకోసం ఏర్పాటు చేశామన్నారు. వీరిలో 15 వేల మంది సా మాన్య ప్రజలు కాగా, మిగతా 5 వేల మంది ఇంటర్ ఆపై చదువుతున్న విద్యార్థులు ఉంటారన్నా రు. భీమిలి స్పాట్ జిల్లాకు కేటాయించగా, అక్కడే వేదిక వద్ద అల్పా హారం ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. తిరుగు ప్రయాణంలో ప్యాకేజ్డ్ భోజనం అందజేయాలని మంత్రులు ఈ సందర్భంగా సూచించారు.
మరుగు దొడ్లు–ట్రాఫిక్ కీలకం
ట్రాఫిక్ నియంత్రణ, మరుగుదొడ్ల ఏర్పాటు విషయంలో ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. 9 పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేశామని, పైడి భీమవరం దాటి జిల్లాలోని ప్రజలకు దాబాలు, పెట్రోల్ బంకులు, నేషనల్ హైవే టాయిలెట్ల వద్ద శుభ్రమైన వసతులు కల్పించనున్నట్టు వివరించారు. యోగాంధ్ర 2025 కోసం జిల్లాలో 6,500 వేదికలు గుర్తించగా, అందులో 3,500 పాఠశాలలు ఉన్నాయన్నారు. జిల్లాలో కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే 9.5 లక్షల మంది రిజిస్ట్రేషన్ పూర్తయ్యిందని, రెండు లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ నెల 21న కార్యక్రమంలో పాల్గొంటారని, మొత్తం 10 లక్షల మందిని కార్యక్రమంలో భాగస్వాములుగా చేయాలన్నదే లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కూన రవికుమార్, బగ్గు రమణమూర్తి, గొండు శంకర్, నడుకుదిటి ఈశ్వరరావు, ఎరగ్రొండపాలెం ఎమ్మెల్యే నారాయణరెడ్డి, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, పలు శాఖలు ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.


