
విన్నపాలు వినవలె..!
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా శ్రీకాకుళంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు, జెడ్పీ సీఈవో ఎల్.ఎన్.వి.శ్రీధర్ రాజా నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై మొత్తం 114 వినతులు అందజేశారు. వీటిలో భూమి సమస్యలు, పింఛన్లు, నివాస స్థలాలు, రేషన్ కార్డులు, మౌలిక వసతులపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. వాటిని సంబంధిత శాఖల అధికారులకు అప్పగిస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు సూచించారు. ప్రజలతో మమేకమై సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు నిబద్ధతతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
పాఠశాల విలీనం ఆపాలి
ఎచ్చెర్ల మండలంలో ధర్మవరం బీసీ కాలనీలోని ప్రాథమిక పాఠశాల విలీనం వెంటనే నిలుపుదల చేయాలని ఆ గ్రామానికి చెందిన పలువురు పీజీఆర్ఎస్లో సోమవారం ఫిర్యాదు చేశారు. ఆ పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ ఆమోదం లేకుండా, విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం నిర్వహించకుండా అడ్డదారిలో పాఠశాలను ఎత్తివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివలన నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉందని అందోళన తెలిపారు. ఫిర్యాదు చేసినవారిలో అల్లు కన్నబాబు, చల్ల పద్మ తదితరులు ఉన్నారు.
పీహెచ్సీ ప్రారంభించండి
శ్రీకాకుళం రూరల్ మండలం కళ్లేపల్లి గ్రామంలో నిర్మాణం పూర్తయిన పీహెచ్సీని వెంటనే ప్రారంభించి, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు సేవలందించాలని కళ్లేపల్లి, సమీప ప్రాంతాల ప్రజలు, నాయకులు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. కళ్లేపల్లి పీహెచ్సీ పరిధిలో కిల్లిపాలెం, కనుగులవానిపేట, ఇప్పిలి, గనగళ్లవానిపేట, కుందువానిపేట, బలరాంపురం, సానివాడ, ఒప్పంగి తదితర గ్రామాలు ఉన్నాయని తెలిపారు. తాత్కాలిక భవనంలో సదుపాయాలు లేకపోవడంతో రోగులు నానా అవస్థలు పడుతున్నారని వెల్లడించారు. అందువలన ఇప్పటికై నా అధికారులు స్పందించి నూతన భవనం ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, జెడ్పీటీసీ మోకాళ్ల శ్రీధర్, ఎంపీటీసీ చిట్టి జనార్దన్రావు, మోకాళ్ల తాతబాబు, గంగు నరేంద్ర, కనుగుల అప్పలనాయుడు, మాజీ ఎంపీటీసీ పుక్కల శ్రీరాములు, సర్పంచ్లు వారాధి ఆదినారాయణ, సూరాడ సూర్యం, లోలుగు శ్రీనివాసరావు, గంగు నాగరత్నం తదితరులు పాల్గొన్నారు.
పీజీఆర్ఎస్కు వినతుల వెల్లువ
అర్జీదారుల నుంచి 114 వినతుల స్వీకరణ
మురుగునీటి సమస్య పరిష్కరించండి
శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 1వ వార్డు పాత్రునివలస హైటెక్ పారడైజ్ నివాసాల మురుగునీటి సమస్య పరిష్కరించాలని హైటెక్ పారడైజ్ అపార్టుమెంట్ ప్రతినిధి వి.కృష్ణమూర్తి పీజీఆర్ఎస్లో కోరారు. ఇదే విషయమై మే 26న ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలియజేశారు. శ్రీకాకుళం పట్టణ నడబొడ్డున గేటెడ్ కమ్యూనిటీ పేరున కొన్ని సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఈ అపార్టుమెంట్లో ఇప్పటికీ మురుగునీటి పారుదల వ్యవస్థ పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయలేదని వివరించారు. దీనివల్ల ఇక్కడ ఉన్న నాలుగు బ్లాకుల్లో (ఒకటి నిర్మాణంలో ఉంది) నివాసితులు వినియోగించే నీరు అపార్టుమెంట్ ఆవరణలోనే చేరుతోందని పేర్కొన్నారు. మురుగునీరు చేరడం వలన రోగాలు బారినపడే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.

విన్నపాలు వినవలె..!

విన్నపాలు వినవలె..!