
నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి
మెళియాపుట్టి: రేగులపాడు ఆప్షోర్ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు గంగారపు సింహాచలం డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద చీపురుపల్లి, దాసుపురం తదితర గ్రామాలకు చెందిన నిర్వాసితులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని సోమవారం చేపట్టారు. అనంతరం డీటీ రాము, ఎంపీడీవో నరసింహప్రసాద్ పండాకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సింహాచలం మాట్లాడుతూ.. ప్రాజెక్టు కోసం ఇళ్లు, భూములు, గ్రామాలను సైతం త్యాగం చేసిన నిర్వాసితులకు న్యాయం చేసి, వారి న్యాయపరమైన డిమాండ్లు ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర మంత్రులు, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు దృష్టిసారించాలని విన్నవించారు.
ఒకటే నిర్వాసిత కాలనీతో ఇబ్బందులు
నిర్వాసితులకు మొత్తం ఏడు నిర్వాసిత కాలనీలు నిర్మించాల్సి ఉన్నప్పటికీ కేవలం ఒక్కటే నిర్మించారని, దీనివల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. ప్రాజెక్టు ప్రారంభించి 16 సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ నిర్వాసితులకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్ ప్రతీ ఏడాది పెరుగుతున్నా.. నిర్వాసితుల సమస్యలు మాత్రం ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నచందంగా ఉన్నాయని వాపోయారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం హిరమండలం వంశధార నిర్వాసితులకు ఇచ్చిన ప్రాప్తికి ప్యాకేజీలు అందించాలని, నేటికీ నిర్వాసితులకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించలేదన్నారు. ఇప్పటికీ కూడా ప్రాజెక్ట్ పరిధిలో 132 మందికి ప్యాకేజీలు పెండింగ్ ఉన్నాయన్నారు. పునరావాస కాలనీల్లో రహదారులు, వీధి దీపాలు, మౌలిక సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సర్పంచ్ యవ్వారి ఈశ్వరరావు, దొర విజయ్ కుమార్, కిరణ్, మాధవరావు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు సింహాచలం