భాస్కరరావుకు ‘బాలు’ స్మారక పురస్కారం | - | Sakshi
Sakshi News home page

భాస్కరరావుకు ‘బాలు’ స్మారక పురస్కారం

Jun 15 2025 9:17 AM | Updated on Jun 15 2025 9:17 AM

భాస్కరరావుకు ‘బాలు’ స్మారక పురస్కారం

భాస్కరరావుకు ‘బాలు’ స్మారక పురస్కారం

శ్రీకాకుళం కల్చరల్‌: నగరానికి చెందిన ఫిల్మ్‌ డబ్బింగ్‌ ఆర్టిస్టు, ఆల్‌ ఇండియా రేడియో బి–గ్రేడ్‌ గాయకుడు కె.భాస్కరరావు డాక్టర్‌ ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం స్మారక పురస్కారానికి ఎంపికయ్యారు. ఘంటసాల, బాలు, ఆనంద్‌ (జి.బి.ఎ) స్వరమాధురి వెల్ఫేర్‌ అండ్‌ సర్వీస్‌ సొసైటీ నిర్వాహకులు ఈ నెల 16న బాపూజీ కళామందిర్‌లో జరిగే జయంత్యుత్సవ కార్యక్రమంలో సత్కరించనున్నారు. భాస్కరరావు మూడు దశాబ్దాలుగా గాయకునిగా, సామాజిక సేవకుడిగా అందిస్తున్న సేవలను గుర్తించి ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. గతంలో ఈయన హైదరాబాద్‌ తెలుగు విశ్వవిద్యాలయంలో లలిత సంగీతం డిప్లమో కోర్సులో ఉత్తమ విద్యార్థి పురసస్కారాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఫ్రీలాన్స్‌ జర్నలిస్టుగా కొనసాగుతూనే పార్ట్‌ టైం ప్రాతిపదికన కోటబొమ్మాళి జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో డ్రాయింగ్‌ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. భాస్కరరావుకు పురస్కారం ప్రకటించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.

సీపీఐ జిల్లా కార్యవర్గం ఎన్నిక

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): పాతపట్నం మండల కేంద్రంలో రెండు రోజులపాటు జరిగిన సీపీఐ 25వ జిల్లా మహాసభలు ఘనంగా ముగిశాయని పార్టీ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ తెలిపారు. శనివారం జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ పేదల సమస్యలపై పోరాటేందుకు కమ్యూనిస్టు పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. అనంతరం పార్టీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. పార్టీ జిల్లా కార్యదర్శిగా చాపర వెంకటరమణ, జిల్లా సహాయ కార్యదర్శిగా లండ వెంకటరావు, కార్యవర్గ సభ్యులుగా చాపర సుందర్‌లాల్‌, కొన్న శ్రీనివాస్‌, ఎస్‌.నారాయణస్వామి, పి.అరేలమ్మ, ఎస్‌.హరికృష్ణ, బి.సంతోష్‌లను, జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. వీరితోపాటు 31 మంది సమితి సభ్యులను ఎన్నుకున్నారు. సమావేశంలో ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు మొజ్జాడ యుగంధర్‌, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొన్న శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

పాలిసెట్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

ఎచ్చెర్ల: పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు పాలిటెక్నికల్‌ డిప్లమో కోర్సుల్లో ప్రవేశాలు కల్పించడానికి ఉద్దేశించిన ఏపీ పాలిసెట్‌ –2025 వెబ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైనట్లు సహాయ కేంద్రం జిల్లా సమన్వయకర్త, శ్రీకాకుళం పురుషుల పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ బి.జానకిరామయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 20లోగా ప్రోసెసింగ్‌ ఫీజు చెల్లించాలన్నారు. ఓసీ, బీసీలు రూ.700, ఎస్సీ, ఎస్టీలు రూ.250 చొప్పున ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. ప్రోసెసింగ్‌ ఫీజు రసీదు, ఫీజు, పాలిసెట్‌ హాల్‌టికెట్‌, ర్యాంక్‌ కార్డు, పదో తరగతి ధ్రువపత్రం, నాలుగు నుంచి పదో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్‌, ఈడబ్ల్యూఎస్‌, కుల, ఆదాయ ధ్రువపత్రాలు, టీసీ సర్టిఫికెట్లతో శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల పాలిటెక్నిక్‌ కళాశాల సహాయ కేంద్రానికి హాజరుకావాలని సూచించారు. ఈ నెల 21 నుంచి 28 వరకూ ధ్రువపత్రాల పరిశీలన, వెబ్‌ ఆప్షన్‌ నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. ప్రత్యేక కేటగిరి వారికి ఈ నెల 25 నుంచి 28 వరకూ విజయవాడలో బెంజి సర్కిల్‌ సమీపంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో కౌన్సిలింగ్‌ జరుగుతుందని పేర్కొన్నారు. తొలివిడత కౌన్సిలింగ్‌కు సంబంధించి బ్రాంచ్‌లు, కళాశాలల కేటాయింపు జాబితాలు వచ్చే నెల 3న విడుదలవుతాయన్నారు.

ఈ నెల 21న 1 నుంచి 15 వేల ర్యాంకు, 22న 15,001 నుంచి 32000 వరకు, 23న 32001 నుంచి 50000 వరకు, 24న 50001 నుంచి 68,000 వరకు, 25న 68,001 నుంచి 86000 వరకు, 26న 86,001 నుంచి 1,04,000 వరకు, 27న 1,04,000 నుంచి 1,20,000 వరకు 28న 1,20,000 నుంచి చివరి ర్యాంక్‌ వరకూ ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని వివరించారు. జూలై 1న వెబ్‌ ఆప్షన్‌ల మార్పులు, చేర్పులు చేసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement