భవితకు..
● ఉమ్మడి జిల్లాలో 10 కళాశాలలు ● ఐదు ప్రభుత్వ కళాశాలల్లో 780 సీట్లు ● ఐదు ప్రైవేట్ కళాశాలల్లో 1,801 సీట్లు ● ఈనెల 30న పాలీసెట్ పరీక్ష
ఎచ్చెర్ల క్యాంపస్: పేద, మధ్య తరగతి విద్యార్థులు 10వ తరగతి ఉత్తీర్ణత తర్వాత ప్రాధాన్యతనిచ్చే కోర్సుల్లో పాలిటెక్నిక్ కోర్సు ఒకటి. ఈ కోర్సులో చేరడం వలన తక్కువ వయస్సులో ఉద్యోగం, ఆసక్తి ఉంటే ఇంజినీరింగ్ చదివేందుకు అవకాశం ఉంటుంది. సాంకేతిక విద్యాశాఖ సైతం పారిశ్రామిక రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు అనుగుణంగా కరిక్యులమ్ తీర్చిదిద్దుతోంది. మిగతా కోర్సులతో పోల్చిచూస్తే పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్లేస్మెంట్లు ఎక్కువ. రైల్వే, డిఫెన్స్, ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి.
ఉచిత శిక్షణ
ప్రభుత్వ కళాశాలల్లో పాలీసెట్ – 2025కు సాంకేతిక విద్యాశాఖ ఉచిత శిక్షణ ఇస్తోంది. శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పురుషులకు, శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా కళాశాలలో బాలికలకు, ఆమదాలవలస, టెక్కలి, సీతంపేట పాలిటెక్నిక్ కళాశాలల్లో బాలురు, బాలికలకు గురువారం నుంచి శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ ఈనెల 28వ తేదీ వరకు ఉంటుంది. నమూనా పరీక్ష సైతం శిక్షణ ముగింపు చివరిలో నిర్వహిస్తారు. ప్రారంభంలో స్టడీ మెటీరియల్ సైతం అందజేస్తారు.
దరఖాస్తుల స్వీకరణ
ప్రస్తుతం పాలీసెట్ – 2025 దరఖాస్తుల స్వీకరణ ఆన్లైన్లో కొనసాగుతోంది. మార్చి 12వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఈనెల 15వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సౌలభ్యం కోసం సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలకు విద్యార్థులు http://apsbtet.ap.gov.in వెబ్సైట్ను సందర్శించాల్సి ఉంటుంది. పరీక్షను ఈనెల 30వ తేదీన నిర్వహిస్తారు. దరఖాస్తు రుసుము బీసీ, ఓసీ విద్యార్థులకు రూ.400 లు, ఎస్సీ, ఎస్టీలకు రూ.100లుగా నిర్ణయించారు. 120 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. గణితం నుంచి 50 మార్కులు, ఫిజిక్స్ నుంచి 40 మార్కులు, కెమిస్ట్రీ నుంచి 30 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. రెండు గంటల్లో పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహిస్తారు.
సద్వినియోగం చేసుకోవాలి
పదో తరగతి పరీక్షలు పూర్తవ్వడంతో ప్రభుత్వ పాలిటెక్నక్ కళాశాలల్లో పాలీసెట్ –2025 శిక్షణ 3వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నాం. ఈ శిక్షణ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. నిపుణులతో శిక్షణ ఇవ్వడం, నమూనా పరీక్ష నిర్వహించడం, స్టడీ మెటీరియల్ అందజేయడం జరుగుతుంది. సాంకేతిక విద్యాశాఖ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దృష్టిలో పెట్టుకొని సిలబస్ను సైతం తీర్చిదిద్దింది.
– బి.జానకి రామయ్య,
శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా ప్రవేశాల ఇన్చార్జి
మెరుగైన ప్లేస్మెంట్స్
మిగతా కోర్సులతో పోల్చితే పాలిటెక్నిక్ విద్యలో ప్లేస్మెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ప్రారంభం నుంచి మూడేళ్ల పాటు పారిశ్రామక అవసరాలపై శిక్షణ ఉంటుంది. ప్రయోగ విద్యకు ప్రాధాన్యత ఉంటుంది. కాలానుగుణంగా సిలబస్లో సైతం సాంకేతిక విద్యాశాఖ మార్పులు చేస్తోంది.
– మురళీకృష్ణ,
సీనియర్ అధ్యాపకులు
జిల్లాలో ఐదు ప్రభుత్వ కళాశాలల్లో 780, ఐదు ప్రైవేట్ కళాశాలల్లో 1,801 సీట్లు ఉన్నాయి. మొత్తం 2,581 సీట్లు ఉన్నాయి. సీసీపీ, సివిల్, మెకానికల్, ఈఈఈ, ఎంఈసీ బ్రాంచ్లు
ప్రధానంగా ఉన్నాయి.
బాలికలకు ప్రత్యేక శిక్షణ
మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో బాలికలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. ఈ అవకాశాన్ని బాలికలు సద్వినియోగం చేసుకోవాలి. పాలిటెక్నిక్ విద్య తర్వాత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఆసక్తి మేరకు ఉన్నత విద్య సైతం చదవవచ్చు. విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి.
– టి.విక్టర్ పాల్,
శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్, ప్రిన్సిపాల్
పాలిటెక్నిక్..!
పాలిటెక్నిక్..!
పాలిటెక్నిక్..!
పాలిటెక్నిక్..!
పాలిటెక్నిక్..!