
కేంద్ర ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి
అరసవల్లి: కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక పథకాలు సబ్సిడీలతో అమలవుతున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకునేలా అధికారులు చర్యలు చేపట్టాలని కేంద్రమంత్రి కె.రామ్మోహన్నాయుడు ఆదేశించారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమీక్షలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లా సమగ్రాభివృద్ధికి అధికారులంతా బాధ్యతగా విజన్తో కూడిన ప్రణాళికలు రూపొందించాలని కోరారు. ఆ ప్రణాళికల అమలుతో జిల్లాలో భవిష్యత్ తరాలు కూడా మంచి ఫలితాలు పొందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
వివిధ శాఖలపై సమీక్ష
అనంతరం ఉపాధి హామీ, ఆర్డబ్ల్యూఎస్, జల్జీవన్ మిషన్, పీఎం ఆవాస్ యోజన, డీఆర్డీఏ తదితర శాఖల ప్రగతిపై, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్షించారు. కార్యక్రమంలో పాల్గొన్న 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఎలాంటి ముందుచూపు లేకుండా పరిపాలన చేసిందన్నారు. ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ మాట్లాడుతూ జల్జీవన్ మిషన్ నిధులతో ఉద్దానం ప్రాంతంలో గత ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపించారు. కార్యక్రమంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, శ్రీకాకుళం, నరసన్నపేట, పలాస, ఆమదాలవలస ఎమ్మెల్యేలు గొండు శంకర్, బగ్గు రమణమూర్తి, గౌతు శిరీష, కూన రవికుమార్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జేసీ ఫర్మాన్ అహ్మద్ఖాన్, జెడ్పీ సీఈవో శ్రీధర్రాజా తదితరులు పాల్గొన్నారు.
అంతా తానై వ్యవహరించిన ‘కూన’
దిశ సమీక్ష చేసేందుకు కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ దినకర్, విప్ అశోక్ తదితరులు వేదికపైన ఉన్నప్పటికీ ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అంతా తానై వ్యవహరించారు. అసలు కేంద్రమంత్రి, చైర్మన్ దినకర్లు ఒకేసారి సమీక్షించడం తగదని చెప్పేశారు. ఇకముందు అలా కాకుండా వేర్వేరుగా సమీక్షించాలని, లేదంటే అధికారులపై తీవ్ర ఒత్తిడి ఉంటుందన్నారు. అలాగే జల్జీవన్ మిషన్, ఇళ్ల కేటాయింపులు తదితర శాఖలతో సమీక్షలో కూడా తనదైన శైలిలో కూన రవి పూర్తి ఆధిపత్యధోరణి చూపించారు. దీంతో వేదికమీద ఉన్న కేంద్రమంత్రితో పాటు అతిథిగా వచ్చిన దినకర్ కూడా మిన్నకుండిపోవాల్సి వచ్చింది.
దిశ సమీక్షలో కేంద్రమంత్రి
రామ్మోహన్నాయుడు