● సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్
కదిరి: సోలార్ పవర్ ప్రాజెక్టు టీడీపీకి చెందిన కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్కు కల్పతరువుగా మారిందని సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ అన్నారు. శనివారం ఆయన స్థానిక సీపీఐ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సోలార్ ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదన్నారు. అయితే బలవంతపు భూసేకరణను మాత్రం ఒప్పుకోబోమన్నారు. ఎన్పీ కుంట మండల పరిధిలో ఉన్న సోలార్ ప్రాజెక్టు నుంచి ఎమ్మెల్యే కందికుంటకు నెలసరి మామూళ్లు అందుతున్నాయని ఆరోపించారు. రైతులు, రైతు కూలీలు, పాడి రైతుల పట్ల ఎమ్మెల్యే చులకన భావంగా మాట్లాడుతున్నారని, సరైన సమయంలో ఆయనకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రైతులను, కమ్యూనిస్ట్ పార్టీలను కించపరిచే విధంగా మరోసారి కందికుంట మాట్లాడితే ఆయన అవినీతి బాగోతాన్ని ఆధారాలతో సహా బయట పెట్టడం ఖాయమన్నారు.
కమీషన్ల కోసమే బైపాస్ పనులకు బ్రేక్
కదిరి బైపాస్ రోడ్ పనుల్లో రెండు, మూడు విద్యుత్ టవర్లు మార్చాల్సి ఉండగా... ఎమ్మెల్యే కందికుంట 10కి పైగా టవర్లు మార్చాలని ఆ పనులు ఆపేశారన్నారు. ఎక్కువ టవర్లు మారిస్తే ఎమ్మెల్యేకు రూ.కోట్లలో కమీషన్లు అందుతాయన్నారు. సమావేశంలో ఏపీ రైతు సంఘం నేత కాటమయ్య, సీపీఐ నేత నల్లజోడు పవన్, ఏఐఎస్ఎఫ్ నేత శేషం మహేంద్ర తదితరులు పాల్గొన్నారు.


